పురుషోత్తమ చౌదరి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. క్రైస్తవ మత ప్రచారం కొరకు అనేక కావ్య రచనలు చేసిన తొలి తెలుగు కవి. అనేక క్రైస్తవ పద్య కృతులను, కీర్తనలను రచించి తెలుగు క్రైస్తవ కవి సార్వభౌముడుగా ఖ్యాతిని పొందాడు. తాను రాసిన కీర్తనలను స్వయంగా గానం చేస్తూ ఆంధ్ర , ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాలలో సువార్తను ప్రకటించాడు. ఆయన పేరు వినని మరియు ఆయన పాట పాడని తెలుగు క్రైస్తవుడు ఉండడు అనుటలో అతిశయోక్తి లేదు.
బాల్యం మరియు కుటుంబ సాంప్రదాయాలు :
పురుషోత్తమ చౌదరి 1803 సెప్టెంబర్ 5 వ తేదీన పశ్చిమ బెంగాల్ లోని గంజాం జిల్లా మదనాపుర గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కూర్మానాద చౌదరి మరియు సుభద్రాదేవి చౌడ రాణి. వీరి పూర్వీకులు పశ్చిమ బెంగాల్ నుండి ఒరిస్సా ప్రాంతానికి వచ్చి స్థిరపడిన బెంగాల్ బ్రాహ్మణులు. తమ మతాచారాల ప్రకారంగా ఏడు సంవత్సరాల వయస్సులోనే ఆయనకు ఉపనయనం జరిపి , గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించారు.
బాల్యం నుండే పురుషోత్తమ చౌదరి మత నిష్ట కలిగి ఉండేవారు. నిరంతరం విగ్రహారాధన, తీర్థయాత్రాలతో పాటు తన భుజాల పై వైష్ణవ సుచకాలైన శంఖు చక్రాలను కూడా కాల్పించుకున్నాడు. 1823 లో ఆయన వివాహం తన మేనమామ కుమార్తెయైన రాదామణి దేవిని వివాహం చేసుకున్నాడు. సంస్కృతం, ఒరియా, తెలుగు భాషలలో ప్రావీణ్యతను సంపాదించి 20 సంవత్సరాల వయస్సులోనే కవిత్వం రాయడం ప్రారంభించాడు. క్రైస్తవ్యాన్ని స్వీకరించక మునుపు కూడా చాలా హైందవ మత సంబంధిత భక్తి రచనలను చేశారు.
క్రీస్తుతో పరిచయం :
పురుషోత్తమ చౌదరి తన అన్నగారైన జగన్నాధ చౌదరి వద్ద కొంతకాలం పనిచేశారు. అప్పుడే ఆయనకు క్రైస్తవ్యం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. ఆ సమయంలో ఆయనకు విలియం కేరీ తెలుగులో ముద్రించిన కరపత్రం లభించింది. అది చదివిన తరువాత మరింత ఆసక్తి పెరిగి అక్కడి మిషనరీలైన హెలెన్ నాట్ , విలియం డాసన్ లను కలిశారు. అప్పటికే రెవ.ప్రిచెట్ 1818 లో తెలుగులో అనువదించిన నూతన నిబంధన ప్రతి ఆయనకు అందింది. వాక్యాన్ని చదివిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు బయల్పరచడటంతో ఆయనలో విశ్వాస కార్యం జరిగింది. తాను అంతవరకు అనుసరిస్తున్న మతాచారాలు, విగ్రహారాధన, తీర్థయాత్రలు తప్పు అని గ్రహించారు. 1833 అక్టోబర్ 6 న క్రీస్తును అనుసరించాలని నిర్ణయించుకున్నారు. తన తోటి క్రైస్తవులతో కలిసి ఆరాధిస్తూ
“మా యేసు క్రీస్తుని – మరుగు గల్గెనురా
నా యాత్మ ఘన రక్ష – నగము నెక్కెనురా “
అనే కీర్తనను పాడారు. అది తెలుగులో వెలువడిన మొదటి క్రైస్తవ గీతం.
క్రైస్తవునిగా ఎదుర్కొనిన శ్రమలు :
పురుషోత్తమ చౌదరి క్రైస్తవుడు అయిన తరువాత కుటుంబ సభ్యుల నుండి మరియు తన గ్రామస్తుల నుండి ఎన్నో శ్రమలను పొందారు. ఈ శ్రమలు ఆయనలో నిరాశ కలిగించక తాను పొందిన రక్షణానుభవాన్ని ఇతరులకు ప్రకటించాలనే తృష్ణను పెంచాయి. 1836 ఏప్రిల్ 3 న ఆయన భార్య కూడా క్రీస్తును అంగీకరించింది. ఆ సంవత్సరమందే పురుషోత్తమ చౌదరి మిషనరీగా అభిషేకం పొందారు. అనేక శ్రమలు, తిరస్కారాలకు గురైనప్పటికీ, విశ్వాసంలో వెనుకడుగు వేయకుండా వేలకొలది మైళ్ళు కాలినడకన ప్రయాణించి ఆంధ్ర దేశం అంతటా పర్యటించి విస్తృతంగా పరిచర్య చేశారు.
క్రీస్తు పరిచర్యలో పండితుడు :
పురుషోత్తమ చౌదరి పర్లాకిమిడి లో ట్యూటర్ గా పనిచేస్తున్న కాలంలో హెలెన్ నాట్ అనే మిషనరీ లూకా సువార్త మరియు రెండు కరపత్రాలను ఇచ్చారు. ఆయన పురుషోత్తమ చౌదరిని మద్రాసు పంపాలని తలంచినప్పటికీ కటక్ లోని బాప్టిస్ట్ సంఘ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లారు. 1834 లో బ్రెట్ గారి తో కలిసి ఒరిస్సా, ఆంద్ర మరియు కర్ణాటక లోని భళ్ళారి ప్రాంతాలలో పర్యటించి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. తాను రచించిన ‘సువార్త బూర’ పద్య కావ్యాన్ని కూడా వెయ్యి కాపీలు ముద్రించి ప్రజలకు పంచిపెట్టారు. ఆయన ప్రసంగాలలో ప్రాముఖ్యంగా “ గుడ్డివాడు వేరొక గుడ్డి వానిని నడిపించలేడు, ఆ విధంగానే పాపంలో నిండిన దేవతలు పాపులను రక్షించలేవు “ అని ప్రకటించేవారు. ఈయన విశాఖపట్నం మరియు చుట్టుప్రక్కల గ్రామాలలో సువార్త పరిచర్యను చేశారు. మరియు తన బంధువులు , గ్రామస్తులు వెలివేసినప్పటికీ పర్లాకిమిడి మరియు దాని చుట్టు ప్రక్కల గ్రామాల్లో సువార్తను అందించారు.
తెలుగు ప్రజల మద్య ఆయన చేసిన పరిచర్యకు సంతృప్తి చెందిన మిషనరీలు ఆయనను గంజాం జిల్లా లో పాస్టర్ గా నియమించారు. అక్కడ ఆయన 7 సంవత్సరాలు నివసించి పరిచర్య చేశారు. తరువాత 6 సంవత్సరాలు చిరాకోల్ నందు పరిచర్య చేశారు. 1851 లో తన భార్య మరణించిన తరువాత ఆయనను విశాఖపట్నం బదిలీ చేశారు. అక్కడ బైబిల్ అనువాదంలో మిషనరీలకు సహాయపడుతూ అనకాపల్లి, యలమంచిలి, తుని, పీతాపూర్, సామర్లకోట , పెద్దాపురం, కాకినాడ మొదలగు ప్రాంతాలలో సువార్తను ప్రకటించారు. 18౫౨ లో చిట్టివలస లో సువార్త ప్రచారకునిగా ఉంది భీమిలి పట్నం మరియు పోలేపల్లిలో ఆదివారం సాయంత్రాలు పరిచర్య చేసేవారు. ఈ కాలంలో ఆయన కుటుంబ సభ్యులలో అనేకులు ప్రభువుని విశ్వసించి బాప్తీస్మం తీసుకున్నారు.
క్రైస్తవ సాహిత్య సంపద :
పురుషోత్తమ చౌదరి మొత్తం 130 వరకు భక్తి గీతాలను రచించి క్రైస్తవ లోకానికి కానుకగా ఇచ్ఛారు. ఈ పాటలన్నీ భక్తి పూరితమైనవే కాక , సాహితీ సంపదతో నిండి వుంటాయి. ఈ పాటలన్నీ దైవారాధనలోనే కాదుగాని మన ఆత్మా పరిశీలనకు కూడా ఎంతో ఉపకరిస్తాయి.
పురుషోత్తమ చౌదరి రక్షణ చరిత్ర , నిస్తార రత్నాకరము అనే రూపకాలను క్రీ.శ 1846 లో రచించారు. ఇది తెలుగు సాహిత్యంలోనే మొట్టమొదటి క్రైస్తవ సంగీత రూపకాలు. ‘ సత్య భజన’ పేరిట ఒక భజన గీతాల సంకలనాన్ని 1874 లో రచించారు. ఈ భజన గీతాల గ్రంథాలలో ప్రతి కీర్తనకు ముందు తెలుగు వర్ణమాలలో ఒకొక్క అక్షరాన్ని అక్షర క్రమంలో ప్రారంభాక్షరంగా ఉపయోగిస్తూ కంద పద్యాలను రచించారు.
ఈయన అనేక పద్య కావ్యాలను రచించారు. వాటిలో రెండు శతకాలు, యేసునాయక శతకము మరియు యేసు క్రీస్తు ప్రభు శతకము అనువాటిని రచించారు. ‘పంచ రత్నములు’ అనే సీస పద్యాల సంకలనం , క్రైస్తవ నీతి ప్రకాశము మరియు సత్యవేద సారము , కులాచార పరీక్ష అనే పద్యకావ్యాలను రచించారు. క్రీ.శ 1845 లో రచించిన ‘యేసు నాయక శతకము ‘ తెలుగు శతక వాజ్మయంలో మొట్టమొదటి శతకం.
ఆయన తన రచనలలో విగ్రహారాధనను ఖండించారు. ఆయన రాసిన ప్రతీ పాట తన స్వీయ జీవితానుభవ లోతుల్లో నుండి పెల్లుబికినదే. అందుకే ఈనాటికీ తెలుగు క్రైస్తవ సాహిత్యంలో అవి సజీవంగా నిలిచాయి.
పురుషోత్తమ చౌదరి జీవితం పై , ఆయన పాటలలోని సంగీత సాహిత్యాల పై అనేక పరిశోధనలు చేశారు.
ఈ కవి వ్రాసి గానం చేసిన కొన్ని కీర్తనలు –
మంగళమే యేసునకు – మనుజావాతారునకు
దాసుల ప్రార్థన దప్పక యొసిగగెడు
నన్ను గన్నయ్య రావే నా యేసు – నన్ను గన్నయ్య రావే నా ప్రభువా
త్రాహిమం క్రీస్తు నాథ – దయజూడ రావే
యెహోవా నామొర లాలించెను
ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద – సన్నిధికో రక్షకా
రారే మన యేసుస్వామిని – జూతము కోర్కెలూర
యేసు నామమే పావనము మాకు – యేసే గదా నిత్య జీవనము
‘ పయనమై యున్నానయ్య ’ అనే పాట పురుషోత్తమ చౌదరి రచించిన చివరి కీర్తన.
ముగింపు :
పురుషోత్తమ చౌదరి 18 రోజులు కాలినడకన పాటలు పాడుకుంటూ మద్రాసు వరకు వెళ్లారు. 150 ఏళ్ల క్రితం శ్రీకాకుళం లోని తెలుగు బాప్టిస్టు చర్చిని ఆయన స్వహస్తాలతో నిర్మించారు. ఆయన భార్య శ్రీకాకుళం లోనే మరణించారు. ౬౭ ఏళ్ల వయస్సు వరకు ఆంద్ర దేశంలోనే ఉండి , జీవిత చరమాంకాన్ని కటక్ లోని తన పిల్లల దగ్గర గడిపారు. 1852 లో కనుచూపు పూర్తిగా మందగించిన సమయంలో తన కుమార్తెను పిలిపించుకొని ‘‘సకలేంద్రియములారా – చాలు మీ పని దీరె ‘ అనే పాటను పాడి ఆమెచే వ్రాయించారు. చివరకు 1890, ఆగష్టు 26 న తన 87 వ ఏట ప్రభువు సన్నిధిని చేరుకున్నారు.
పురుషోత్తమ చౌదరి గారిని తెలుగు క్రైస్తవ లోకానికి దేవుడు అనుగ్రహించిన బహుమతిగా భావించవచ్చు. ఇప్పటికీ వివిధ సంఘాలలో ఆయన రాసిన కీర్తనలను ఆలపిస్తారు. హైందవ సాహిత్యంలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజుల వలె క్రైస్తవ భక్తి సాహిత్యంలో ఆధ్యాత్మిక ప్రచారం చేసిన వాగ్గేయకారునిగా పురుషోత్తమ చౌదరి పేరు క్రైస్తవ లోకంలో చిరకాలం దేవుని మహిమార్థమై నిలచి ఉంటుంది. యూ ట్యూబ్ లోని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలను విని నేర్చుకొని కుటుంబ ఆరాధనలలో ఆలపించి ఆత్మీయ మేలులను పొందాలని ఆశిస్తున్నాను.
పురుషోత్తమ చౌదరి జీవిత చరిత్రను ఆయన మనుమడైన జాన్ చౌదరి రచించారు. అంతేకాకుండా ఆంద్ర వేదాంత కళాశాలలో ప్రొఫెసర్ గా ఉన్న రావెల జోసఫ్ గారు కూడా ‘ Bhakti Theology of Purushottam Choudari ‘ అనే పుస్తకాన్ని రచించారు.