దేవుని ప్రేమించిన యువతి శారా
శారా ఎడ్వర్డ్స్ యొక్క ప్రారంభ జీవితం గురించి పెద్దగా తెలియదు. ఆమె 1710 లో ప్రముఖ విశ్వ విద్యాలయం యేల్ యొక్క వ్యవస్థాపకులలో ఒకరైన జేమ్స్ పియర్పాంట్ కు జన్మించింది. చిన్నతనం నుంచి కూడా ఆమె క్రైస్తవ భక్తి కలిగి జీవించింది. ఆమె దేవునిని ఎంతో ప్రేమించేది. ఎప్పుడూ దేవుని యందు సంతోషిస్తూ, ఆయనను పాటలతో కీర్తిస్తూ, అందరితో మాట్లాడుతూ ఎంతో ఉత్సాహంగా ఉండేది. యవ్వన ప్రాయంలోనే క్రీస్తును స్వంత రక్షకునిగా స్వీకరించింది. "సృష్టికర్తకు సన్నిహితంగా ఉండటం ద్వారానే సృష్టి లోని జీవులకు గొప్ప ఆనందం లభిస్తుంది" అని భావించేది.
ఒక అసాధారణ కలయిక:
భార్యగా శారా ఎడ్వర్డ్స్
శారా వివాహం జోనాథన్ పరిచారకునిగా నియమి౦చబడిన సంవత్సరంలోనే, ఆమె పదిహేడేళ్ల వయసులో ఉన్నప్పుడే జరిగింది. వారి ఇద్దరి వ్యక్తిత్వాలు చాలా భిన్నమైనవి. అతడు పండితుడు మరియు ముభావి. ఆమె ఇతరులతో ఉండటానికి ఇష్టపడేది. కానీ వారిద్దరికీ దేవునిపట్ల ఒకే విధమైన ప్రేమ ఉ౦డేది. వారిరువురు కలిసి ఒక అద్భుతమైన కుటు౦బాన్ని ఏర్పరచుకున్నారు.
జొనాథన్ ను వివాహం చేసుకున్న తరువాత శారా మసాచుసెట్స్ లోని నార్తాంప్టన్ లోని ఇంటికి మారింది. అక్కడ సంఘంలో బోధకునిగా ఉన్న తన తాత సోలమన్ స్టోడార్డ్ కు సహాయకుడిగా పనిచేశాడు. 1729 ఫిబ్రవరిలో స్టోడార్డ్ మరణించిన తరువాత మసాచుసెట్స్ కాలనీలో అతిపెద్దదైన, సంపన్నమైన మరియు అత్యంత ప్రసిద్ధి చెందిన స౦ఘం యొక్క బాధ్యతలను జోనాథాన్ స్వీకరించాడు.
జొనాథన్, శారా తమ సంఘంలో ప్రారంభమై చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించిన గొప్పఆత్మీయ మేల్కొలుపులో భాగమయ్యారు. ఈ సమయ౦లో తాను దేవునిపట్ల అమితమైన ప్రేమను, ఆయనలో విశ్రాంతిని, స౦తోషాన్నిపొంది, ఆయన సేవకు, మహిమకు తనను తాను నూతనంగా సమర్పి౦చుకోవడ౦ ప్రారంభించానని శారా స్వయంగా ప్రకటి౦చి౦ది.
క్రీస్తుకు సామీప్యంగా శారా కుటుంబ జీవితం
1728లో శారా మరియు జోనాథన్లకు కలిగిన పదకొండు మంది సంతానంలో మొదటి ఆడపిల్ల జన్మించింది. వారి ఇంటికి వచ్చిన అధితులు వారి కుటుంబ జీవితం యొక్క ఆత్మీయత మరియు ప్రేమకు సాక్ష్యమిచ్చారు. శారా దేవుని ప్రసన్నతను తెలుసుకోవడం ప్రారంభించింది. 1735 నాటికి ఆమె నాలుగు సార్లు ప్రసవించింది (ఆ దినాలలో చాలా కష్టతరమైనది). కానీ ఆమె ఇలా రాసింది- చాలా బాధల సమయంలో, నేను తరచూ ఇలా అనగలిగాను: “పరలోకంలో నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? మరియు భూమిపై నిన్ను తప్ప నేను కోరుకునే వారు ఎవరూ లేరు. నా ప్రాణము దేవుని కొరకు, జీవముగల దేవుని కొరకు దాహము కలిగియున్నది."
31 సంవత్సరాల వయస్సు వరకు శారా జీవితం సాఫీగా సాగింది. ఆమె తరచుగా భావోద్రేకము కలిగి మనోవేదన కలిగి ఉండేది. ఈ ప్రవర్తన ఎక్కువసార్లు ప్రసవ వేదన సంబంధిమైన బాధల గుండా వెళ్ళడం ద్వారా కలిగి ఉండవచ్చు. ఆమె కొన్నిసార్లు తన భర్త కీర్తిని ఎక్కువగా ఆకాంక్షించేది మరియు పట్టణ ప్రజల నుండి చెడు అభిప్రాయం ఏదైనా వస్తుందేమోనని భయపడేది. ఒక్కోసారి ఆమె ఆందోళనకు గురయ్యేది.
కానీ అదే సమయంలో రోజుకు పదమూడు గంటల వరకు అధ్యయనంలో గడుపుతూ దైనందిక కుటుంబ వ్యవహారాలలో తలదూర్చని భర్తతో శారా తన ఇంటిని నిర్వహించవలసి వచ్చేది. ముగ్గురు కొడుకులు, ఎనిమిది మంది కూతుళ్లను పెంచడంతో పాటు అతిథులను నిరంతరం అలరించడం ఓ మహిళకు సామాన్యమైన విషయం కాదు. ఎడ్వర్డ్స్ ఇంటికి తరచూ వచ్చే మరో గొప్ప బోధకుడు జార్జ్ విట్ ఫీల్డ్, ఎడ్వర్డ్స్ కంటే మధురమైన జంటను తానెప్పుడూ చూడలేదని అన్నాడు. ఆమె "సౌమ్యమైన మరియు నిశ్శబ్దమైన ఆత్మతో అలంకరించబడింది. అయినప్పటికీ తెలివైన, సమర్థురాలైన స్త్రీగా, దేవుని విషయాల గురించి దృఢంగా మాట్లాడగలిగింది మరియు ఆమె భర్తకు చాలా సహాయకారిగా కనిపించింది" అని అతను పేర్కొన్నాడు.
జోనాథాన్ మరియు శారాల వివాహ మాధుర్యం
జొనాథన్ మరియు శారాల వివాహంలో కనిపించిన ఒక అరుదైన లక్షణం ఏమిటంటే, అతడు ఆమెను తెలివైన మహిళగా గౌరవించాడు. ఆమె బాగా చదువుకుంది, వారి కుమార్తెలు కూడా బాగా చదువుకున్నారు. అందువలన, ఆమె అతని దైనందిక వ్యవహారాలను నిర్వహించడమే కాకుండా, పరిచర్యలో సైతం అతనికి సహాయపడగలిగింది.
వివాహం యొక్క బలాన్ని పెంచే మరొక ప్రేమ బంధం వారిలో ఉంది. శారా, జోనాథానులు క్రీస్తులో ఒకే కుటుంబ సభ్యులు మరియు ఒకే పరలోక రాజ్యానికి వారసులు. ఇది వారికి భూలోక ఆప్యాయతల కంటే ఎక్కువ.
నార్తాంప్టన్లో మరియు న్యూ ఇంగ్లాండ్లో ఉజ్జీవం
జోనాథన్ తన పరిచర్యను ప్రారంభించిన సమయంలో నార్తాంప్టన్లో చాలా మంది ప్రజలు చర్చికి హాజరయ్యేవారు. అయితే చాలామంది నామమాత్రపు క్రైస్తవులు. తక్కువ నైతిక ప్రమాణాలతో చాలా మంది యువత క్రీస్తును రక్షకునిగా స్వీకరించలేదు. అయితే 1734లో ఒక యువకుడి ఆకస్మిక మరణం సంఘాన్ని కదిలించింది. అంత్యక్రియల సమయంలో జోనాథన్ కీర్తన 90:5–6పై బోధించాడు. మరణానికి మరియు తీర్పుకు సిద్ధం కావాలని అందరినీ సవాలు చేశాడు. చిన్న చిన్న ప్రార్థన బృందాలు ఏర్పడ్డాయి. 1735 ప్రారంభంలో చాలా మంది తమ పాపాల నిమిత్తమై పశ్చాత్తాపపడ్డారు మరియు రక్షణ నిశ్చయతను కనుగొన్నారు. ఐదు నుండి ఆరు వారాల వ్యవధిలో వారానికి సగటున ముప్పై మంది క్రీస్తును అంగీకరించారు. ఆరు నెలల తర్వాత మూడు వందల మంది క్రీస్తును వెంబడించారు.
మరుసటి సంవత్సరం పొడవునా నార్తాంప్టన్లో మరియు న్యూ ఇంగ్లాండ్లోని అనేక ఇతర కమ్యూనిటీలలో అలాగే బ్రిటన్ మరియు వెలుపల కూడా పునరుజ్జీవం కొనసాగింది. జార్జ్ విట్ఫీల్డ్ 1740లో న్యూ ఇంగ్లండ్ను సందర్శించినప్పుడు అతను వేలాది మంది ప్రజలకు బోధించాడు.
జోనాథన్ 1742 ప్రారంభంలో ఇంటి నుండి దూరంగా బోధిస్తున్నప్పుడు నార్తాంప్టన్లో మరింత పునరుద్ధరణ జరిగింది. తన భర్త తిరిగి వచ్చే వరకు శారా జీవించి ఉంటుందా అని కొందరు ఆశ్చర్యపోయారు. కానీ ఆమె “ నేను క్రీస్తు ప్రేమ యొక్క స్వర్గపు మాధుర్యం, నాతో ఆయన సాన్నిహిత్యం మరియు నాపట్ల ఆయన ప్రేమ గురించి స్థిరమైన, స్పష్టమైన మరియు సజీవమైన భావనలో కొనసాగాను.” అని పలికింది.
దేవుని ప్రేమ యొక్క వ్యక్తిగత అనుభవంతో పాటు, ఆమె ఇతరుల పట్ల తీవ్రమైన ప్రేమ మరియు కరుణనుకలిగి వుండేది. పరిచర్యలో ఆమె మరింత ప్రభావవంతంగా పనిచేసేది. “దేవుని మహిమపరచడం ప్రాధాన్యత. అది బాధను కలిగి ఉంటే, అలాగే కొనసాగండి. ఆయన మహిమ అన్నింటిలోనూ ఉంది.”
విపత్కర పరిస్థితుల మధ్య పరిచర్య
1744లో ఇంగ్లండ్ మరియు ఫ్రాన్స్ యుద్ధం ప్రకటించినప్పుడు నార్తాంప్టన్ వంటి పట్టణాల నివాసులు దాడికి గురి అయ్యారు. (ఇంగ్లీష్ సెటిలర్లను చంపడానికి ఫ్రెంచ్ కెనడియన్లు ఉత్తర అమెరికా భారతీయుల మధ్య మిత్రులకు డబ్బు చెల్లించారు.) పట్టణం నిరంతరం అప్రమత్తంగా ఉన్నప్పటికీ పలువురు మృతి చెందారు. జోనాథన్ మరియు శారా ప్రశాంతంగా ఉండి పరిచర్య చేయడానికి అక్కడే ఉన్నారు. అయినప్పటికీ యుద్ధం ఆర్థిక ఇబ్బందులకు దారితీసింది. పారిష్ సభ్యులు తమను తాము పోషించుకోవడానికి చాలా కష్టపడ్డారు మరియు ఎడ్వర్డ్స్ జీతం తరచుగా చెల్లించబడలేదు. శారా చర్చికి సవివరమైన గృహ బడ్జెట్లను సమర్పించవలసి వచ్చింది మరియు ప్రతి ఆరాధన ముగింపులో విశ్వాసులు మాత్రమే ప్రభు సంస్కారం తీసుకోవాలని జోనాథన్ ప్రకటించాడు. ఇది వివాదానికి కారణమైంది. జోనాథన్ సొంత బంధువులతో సహా చర్చిలోని వర్గాలు తమ ఆయనకు వ్యతిరేకంగా మారాయి. చర్చి చివరికి జూన్ 1750లో జోనాథన్ను తొలగించింది, కుటుంబానికి ఆర్థిక సహాయం లేకుండా చేసింది. అయినప్పటికీ జోనాథన్ మరియు శారా ఎవరినీ దీని విషయమై ద్వేషించలేదు. దేవుడు తప్ప అందరి అభిప్రాయానికి వారు లోబడలేదు. తరువాత ఒక బంధువు వారి గురించి అనేక అసత్యమైన అపవాదులను వ్యాపించాడని అంగీకరించాడు. కాని వారు ఎప్పుడూ అతడిని బహిరంగంగా నిరూపించాలని కోరలేదు.
1751లో స్టాక్బ్రిడ్జ్లోని రిమోట్ మిషన్ స్టేషన్కు పరిచర్య చేయడానికి వచ్చిన పిలుపును జోనాథన్ అంగీకరించాడు. నార్తాంప్టన్తో పోలిస్తే పరిస్థితులు కఠినంగా ఉన్న సరిహద్దుకు కుటుంబం మకాం మార్చింది. ఈ స్థావరం పన్నెండు ఆంగ్ల కుటుంబాలతో పాటు ఉత్తర అమెరికా భారతీయుల యొక్క రెండు వేర్వేరు సమూహాలతో రూపొందించబడింది. అయినప్పటికీ, ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నాయి మరియు ఆంగ్లేయులు మరియు ఫ్రెంచ్ వారి మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా అందరూ భయంతో జీవించారు. భారతీయులు మధ్యలో చిక్కుకున్నారు. ప్రతి రోజు, భయంకరమైన దారుణాల గురించి వార్తలు వచ్చాయి. అంతర్భాగాన్ని విడిచిపెట్టిన శరణార్థుల ప్రజలకు, అలాగే వారితో వచ్చిన సైనికులకు శారా భోజనం అందించాల్సి వచ్చింది.
స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఎడ్వర్డ్స్ను పరిచర్య విడిచిపెట్టమని వేడుకున్నారు. కానీ జోనాథన్ మరియు శారా తమ పిలుపు మార్గంలో బయటకు రావడం కంటే అక్కడే సురక్షితంగా ఉన్నామని భావించారు.
ఎడ్వర్డ్స్ ఉత్తర అమెరికా భారతీయుల పట్ల భారం కలిగి ఉన్నారు. వారి 9 ఏళ్ల కుమారుడిని కూడా మరొక భారతీయ భాష నేర్చుకోవడం కోసం ఒక మిషనరీతో మారుమూల ప్రాంతానికి పంపారు. జోనాథన్ ఒక లేఖలో ఇలా వ్యాఖ్యానించాడు "భారతీయులు నా కుటుంబం పట్ల, ముఖ్యంగా నా భార్య పట్ల చాలా సంతోషంగా ఉన్నారు"
ఎడ్వర్డ్స్ కుటుంబంలో విషాదం
1740ల చివరి నుండి ఎడ్వర్డ్స్ కుటుంబం అనుభవించిన దుఃఖాల పరంపర అత్యంత కఠినమైనది. జెరూషా ఎడ్వర్డ్స్, జోనాథన్ మరియు సారా యొక్క రెండవ కుమార్తె 1748లో 17 సంవత్సరాల వయస్సులో మరణించారు. డేవిడ్ బ్రెయినార్డ్ అనే సందర్శకుడైన మిషనరీ క్షయవ్యాధితో బాధపడుచుండగా ఆయన సంరక్షణకు ఆమె ముందుకొచ్చింది. కానీ ఆమె కూడా ఆ వ్యాధితో మరణించింది. అసాధారణమైన దైవభక్తితో జెరూషా "కుటుంబపు పుష్పం"గా పరిగణించబడింది. కానీ ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె తన ప్రియ ప్రభువుతో ఉన్నదని తెలుసుకుని దేవుని సార్వభౌమాధికారానికి లోబడ్డారు.
1752లో, 20 ఏళ్ల ఎస్తేర్ ప్రిన్స్టన్లోని న్యూజెర్సీ కళాశాల అధ్యక్షుడైన 36 ఏళ్ల ఆరోన్ బర్ను వివాహం చేసుకుంది. కానీ ఆరోన్ 1757లో కేవలం 41 సంవత్సరాల వయస్సులో మరణించాడు. న్యూజెర్సీ కళాశాల అధ్యక్షుడిగా జోనాథన్ అతని స్థానంలోకి రావడానికి ఆహ్వానించబడ్డాడు. అతడు కుటుంబం కంటే ముందుగా ప్రిన్స్టన్కు వెళ్లాడు. పదవిని చేపట్టిన వెంటనే మార్చి 1758లో, జొనాథన్ మశూచి వ్యాధి వలన మరణించాడు. మరణిస్తున్నప్పుడు అతడు శారాకు సందేశం పంపాడు. వారు ఆనందించిన "అసాధారణ కలయిక" కోసం దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, క్రీస్తులో వారి ముందు ఉన్న శాశ్వతత్వం వైపు చూస్తున్నానని తెలిపాడు. శారా తన భర్త అకాల మరణం గురించి భయంకరమైన వార్తను అందుకున్నప్పుడు ఆమె గొప్ప విశ్వాసంతో ప్రతిస్పందించింది. అంతలోనే ఆమెకు మరో భయంకరమైన వార్త అందింది. ఎస్తేర్ తన తండ్రి మరణించిన కొన్ని రోజులకే మరణించింది. శారా వెంటనే తన స్వంత కుటుంబాన్ని విడిచిపెట్టి తన ఇద్దరు అనాథ మనవళ్లను తీసుకురావడానికి ప్రిన్స్టన్కు వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్ళే మార్గంలో ఆమె తీవ్ర అనారోగ్యంతో అక్టోబర్ 2, 1758 న 48 సంవత్సరాల వయస్సులో మరణించింది.
ముగింపు
శారా తన జీవితంలో, తన సొంత కుటుంబంలో లేదా నార్తాంప్టన్లో మాత్రమే కాకుండా, ప్రపంచం అంతటా పునరుజ్జీవనం కోసం ఆకాంక్షించింది. ఎడ్వర్డ్స్ ఆశయాలు మరియు ప్రార్థనలు వ్యక్తిగత, కుటుంబ లేదా సంఘ ఆందోళనలకు మించినవి. అవి క్రీస్తు యొక్క అంతిమ మరియు విశ్వ విజయానికి సంబంధించినవి. కాబట్టి ప్రపంచ సువార్తీకరణ మరియు పునరుజ్జీవం కోసం ప్రార్థనలో ఐక్యం కావాలని జోనాథన్ విశ్వాసులందరినీ కోరేవాడు.
మనం కుటుంబాల పట్ల దేవుని ప్రణాళికను అర్థం చేసుకుందాం. యెహోషువా 24:15 లో చెప్పిన విధంగా “నేనునూ , నా యింటివారునూ యెహోవాను సేవించెదము” అంటూ కలసి పనిచేయడం లోని ఆనందాన్ని పొందుదాం. మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ, ఆయన ప్రేమను ఆస్వాదిస్తున్నప్పుడు, ఆయన అందరిచేత ఘనపరచబడాలని మరియు ఆయన మహిమ భూమిని నింపాలని ఆశ పడతాము. మనము కూడా మన స్వంత అనుభవంలో, మన కుటుంబం, మన సంఘం, మన దేశం మరియు ప్రపంచ పునరుజ్జీవం కోసం ప్రార్థించి పాలిభాగస్థుల మవుదాము.
(పై వ్యాసం ఇంటర్నెట్ వనురుల నుండి సేకరించబడినది)