Sunday 3 March 2024

పండిత రామాబాయి - వెలివేయబడినవారికి తల్లి (1858-1922)

 


కలతలు లేని బాల్యం :

పండిత రామాబాయిగా పేరుగాంచిన రామాబాయి దక్షిణ భారతదేశములోని మంగళూరు జిల్లాలో ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబము నందు జన్మించింది. ఆమెకు ఆరు సంవత్సరముల ప్రాయములోనే ఆమె తల్లిదండ్రులు తమ బిడ్డలందరితో కలిసి తీర్థయాత్రలు చేయుటకై తమ గృహమును విడిచిపెట్టారు. చిన్నదైన రామాబాయిని ఒక గంపలో కూర్చుండబెట్టుకొని అన్ని స్థలములకు మోసుకొని వెళ్ళేవారు. వారు ఒక పుణ్య స్థలము నుండి మరియొక చోటికి వెళ్లుచూ ప్రతి స్థలములో కొన్ని నెలలు గడిపేవారు. ఆ సమయములో వారు అక్కడ గల పవిత్ర నదులలో స్నానము చేయుచూ సమీపాన గల ఆలయాలనన్నిటిని దర్శించేవారు. వారి తండ్రి సంస్కృత భాషలో మిక్కిలి పాండిత్యము గలవాడు. భక్తి శ్రద్ధలు గల హిందువులకు అతడు పురాణములను చదివి వినిపించేవాడు. వారు సమర్పించే కానుకలతోనే వారి కుటుంబ పోషణ జరిగెడిది. రామాబాయి యొక్క తల్లి కూడా పురాణములను, సంస్కృత భాషలో చదువుట తన భర్త వద్ద నేర్చుకొన్నది. చిన్నదైన రామాబాయి కూడా తన తల్లివద్ద చదువుట నేర్చుకుంది. వారి తండ్రికి ఆ పని చేయుట కష్టమయ్యే వరకూ  వారు ఆ విధముగానే జీవించారు.


 కష్టాలలో కుటుంబం :

వారికి వచ్చే సంపాదన అంతా ఖర్చు అయ్యేది. వారికి గల మత సంబంధమైన నిబంధనల కారణముగా వారు మరియే యితర పనిని చేయలేకపోయేవారు. దక్షిణ భారతదేశములోని వారు నివసించే ప్రాంతములో గొప్ప కరువు సంభవించింది. ఎక్కడ చూచినా ప్రజలు ఆకలి బాధతో అలమటించుచూ ఒక ప్రదేశము నుండి మరియొక ప్రదేశమునకు తరలిపోసాగారు. రామాబాయి వారి కుటుంబస్థులు బిచ్చమెత్తలేక, మరియే యితర పనిని చేయలేకపోవుటచే వారు తినుటకు తిండి గింజలు లేని పరిస్థితి వారికి ఒక దినమున ఎదురయ్యెను. వారు అందరూ సామూహికముగా ఆత్మహత్య చేసుకొనవలెనని తలంచిరి. కాని దేవుడు ఆ విధముగా వారు చేయకుండ తన కృపను వారిపై చూపెను. వారు ఒక గ్రామములోని ఆలయములో తలదాచుకొనిరి గాని బ్రాహ్మణ పూజారులు వారిని వెళ్లగొట్టారు. వారు గ్రామము వెలుపల గల ఒక పురాతన, శిథిలమైన ఆలయములోనికి తమ మకాము మార్చిరి. అచ్చటనే వారి తండ్రి మరణించాడు. పిమ్మట కొద్ది కాలమునకే వారి తల్లి మరియు సహోదరులు కరువు బాధకు తట్టుకొనలేక మరణించారు. ఈ విధమైన శ్రమలు ఆమెకు చిన్న ప్రాయములోనే సంభవించుట వలన తరువాతి కాలములో అటువంటి శ్రమలలో నున్నవారిని విడిపించుటకు, వారికి సహాయము చేయుటకు గల అనుభవమును పొందగలిగింది.


కలకత్తా నగరములో రామాబాయి:

రామాబాయి మరియు ఆమె సహోదరుడు మాత్రమే వారి కుటుంబములో మిగిలారు. ఒక రాత్రి వారు చలిలో తమను తాము గొంతువరకు యిసుకలో పూడ్చుకొనుటకు నదీ తీరమునకు వెళ్లారు. తరచుగా వారు పస్తులుండేవారు. వారు ఆ విధముగానే ఒక ప్రదేశము నుండి మరియొక ప్రదేశమునకు వెళ్లుచూ ఆలయములను దర్శించుచూ దేవుళ్లను మ్రొక్కుచూ  దాదాపు భారతదేశమంతయూ తిరిగారు. వారు దాదాపు 4 వేల మైళ్ల దూరమును కాలి నడకనే నడచి చివరకు కలకత్తా నగరమును చేరారు. అక్కడ వారికి పండితులైన బ్రాహ్మణులతో పరిచయము కలిగింది. పురాణములను చదివి వినిపించుట ద్వారా వారు తమకు కొంత ధనమును, ఆహారమును సంపాదించుకొనగలిగారు. రామాబాయి యుక్త ప్రాయమునకు వచ్చి ఒక మేథావంతురాలైన స్త్రీ అయ్యింది. అక్కడి పండితులు ఆమె పాండిత్యమునకు అచ్చెరువొందెడివారు. ఆమె భారత స్త్రీలకు విద్య అభ్యసించవలసిన ప్రాముఖ్యత ఎంతో కలదని నొక్కి చెప్పెడిది. ఆమెకు గల పట్టుదలకు, ధైర్యమునకు వారు ప్రశంసించెడివారు. వారు ఆమెను పండిత రామాబాయిగా పిలువసాగారు.

కలకత్తాలోనే ఆమెకు మొదటిగా క్రైస్తవులతో పరిచయము కలిగింది. ఆమె క్రైస్తవుల కూడికకు ఆహ్వానింపబడింది. వారి ఆచార వ్యవహారములు, పద్ధతులు ఆమెలో ఉత్సుకతను కలిగించింది. వారు ఆమెకు సంస్కృత భాషలోని బైబిల్ను చదువుటకై ఇచ్చారు. ఆమె దానిని చదువలేకపోయెను. ఎందుకనగా ఆ విషయములు ఆమెకు బోధపడలేదు. కాని ఆమె దానిని తన వద్దనే దాచుకొన్నది. హిందూ శాస్త్రములను మరియు అనేక పవిత్ర గ్రంథములను పఠించిననూ ఆమె హృదయము అసంతృప్తితో నిండియుండేది. ఎందుకనగా వాటిలో స్త్రీలకు మత సంబంధముగా ఎటువంటి నిరీక్షణ లేదు. ఆమెలో దేవునిని తెలిసికొనవలెనను కోరిక అధికము కాసాగెను. ఆమె తన పూర్వీకుల సనాతన ఆచారములు, సాంప్రదాయముల పట్ల విశ్వాసమును కోల్పోయెను. ఆమె శూద్ర కులమునకు చెందిన ఒక బెంగాలీ యువకుని తన ఇరవై రెండవ ఏట వివాహము చేసుకొనెను. 


క్రీస్తు వైపునకు తిరుగుట :

అస్సాములో ఆమె తన భర్తతో కలిసి జీవింపసాగింది. ఆమె ఒకనాడు బెంగాలీ భాషలో రచించబడిన చిన్న పుస్తకమును చూసింది. ఎంతో అభిరుచితో ఆ పుస్తకమును పఠించింది. అది లూకా సువార్త. ఆమెను ఒక క్రైస్తవ మిషనెరీ కూడా క్రమముగా దర్శించి అనేక బైబిల్ వృత్తాంతములను వినిపించెను. ఆమె క్రైస్తవ బోధల పట్ల ఆకర్షితురాలగుట ఆమె భర్త సహించలేకపోయాడు. రెండు సంవత్సరములు దాంపత్య జీవితమును గడిపిన పిమ్మట ఆమె భర్త కలరా వ్యాధికి గురై మరణించాడు. ఆ విధముగా ఆమె బహు చిన్న ప్రాయములోనే విధవరాలిగా మారింది.

ఆమెకు మనోరమ అను ఒక కుమార్తె జన్మించింది. ఆమె తన భర్త మరణానంతరము తన కుమార్తెను తీసుకొని పూనా పట్టణము చేరింది . అక్కడ కూడా ఆమె క్రైస్తవ్యమును క్రైస్తవ మిషనెరీల నుండి తెలిసికొనుటను కొనసాగించింది.


ఇంగ్లండు దేశ ప్రయాణము:

భారత దేశములోని స్త్రీలను ఉద్ధరించవలెనన్న తనకు మరియెక్కువ విద్య మరియు శిక్షణ అవసరమని గుర్తించింది. కనుక 1883లో ఆమె తన కుమార్తెను తీసుకొని ఇంగ్లండు దేశమునకు వెళ్ళింది. అక్కడ ఆమెకు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ (Church of England) కు చెందిన సహెూదరీల సహవాసము దొరికింది. వారి సహవాస ఫలితముగా ఆమె క్రైస్తవ బోధలచే ప్రభావితము కాగలిగింది. ఆమె అనేక సహెూదరీల ఆశ్రమములను దర్శించింది. వారి పనిని గమనించి  సంఘములో వెలివేయబడిన, హీన స్థితిలో వున్న స్త్రీలకు ఏ విధముగా సహాయము చేయవలెనో తెలిసికొనగలిగింది. వారి జీవితములలో క్రీస్తు తీసుకొని వచ్చిన మార్పును కూడా ఆమె గమనించగలిగింది. ఆయన మాత్రమే హిందూ దేశములోని స్త్రీల జీవితములలో కూడా మార్పును తేగలరని ఆమె విశ్వసించింది.


మారుమనస్సు పొందుట :

ఆ విధముగా ఆమె హృదయము క్రైస్తవ మతమువైపు ఆకర్షింపబడింది. ఆమె బాప్తీస్మము తీసుకొని చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వారిచే నిర్ధారింపబడింది. కాని ఆమె క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరింపలేదు. కనుక ఆమె హృదయ వాంఛ యింకనూ తీరకనే యుండెను. ఆమె అమెరికా దేశమును దర్శించి, అనేక స్థలములలో ప్రసంగించింది. ఆమె ఇండియా దేశమునకు తిరిగి వచ్చినప్పుడు ఎంతో నమ్మకముగా బైబిల్ను తిరిగి పఠించుట ఆరంభించెను. కొన్ని దినముల తర్వాత ఆమే స్వయముగా ఆ విషయమై ప్రస్తావిస్తూ ‘(క్రైస్తవ మతమును ఎరిగియుంటిని, కాని ఆ మతమునకే జీవమైన క్రీస్తును కనుగొనలేకుంటిని' అని పలికెను. ఆమె తన ఆత్మీయ జీవితము పట్ల అసంతృప్తి కలిగియుండేది. చివరకు పరిశుద్ధాత్మచే నడిపింపబడినదై, దేవుని వాక్యము ద్వారా ఆమె క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరింపగలిగింది. మరియు రక్షణ యొక్క నిశ్చయతను సంపాదించుకొన్నది.


"శారదా సదన్" ను స్థాపించుట :

క్రీస్తును ఎరిగిన తరువాత ఆయన సేవ చేయవలెనను గొప్ప ఆశను రామాబాయి కలిగియుండేది. జాన్ పేటన్, హడ్సన్ టేలర్ వంటి మిషనెరీల జీవితములు ఆమెను ఎంతో ప్రభావితము చేసాయి. ఆమె విశ్వాసముతో పరిచర్యను భారతదేశములో ఆరంభించుటకు సవాలు చేయబడింది.

దేవుని పైననే అన్ని అవసరాలకు ఆధారపడుచూ, ఇండియాలోని విధవరాండ్రైన స్త్రీలను మరియు అనాథ బాలలను పాపపు జీవితము మరియు దానివలన వచ్చు అపవాదుల నుండి రక్షించి క్రీస్తు యొద్దకు వారిని నడిపించులాగున వారి నిమిత్తమై ఏదైననూ చేయవలెనను నిర్ణయమును తీసుకొన్నది. దాని మూలముగా ఒక ఆశ్రయ గృహము పూనా పట్టణములో స్థాపించబడింది. దానికి శారదా సదన్ (Sarada Sadan) అని నామకరణము చేసింది. అగౌరవపరచబడినవారు, వెలివేయబడినవారు, ఆకలికి అలమటించేవారు ఆ గృహమునకు ఆహ్వానింపబడ్డారు. ఆ గృహములో నివసించే స్త్రీలు అనేక చేతిపనులు చేయుట, ఏదైనా ఒక వృత్తి విద్యలో అభ్యాసము మున్నగు వాటిలో శిక్షణ నొందుట వలన వారి కాళ్లపై వారు నిలబడుటకు అవకాశము కలిగింది. అనేకమంది అనాథ బాలికలు, వెలివేయబడిన స్త్రీలు ఆ గృహములో చేరారు. వారిని రామాబాయి ఎంతో దయతో, ప్రేమతో చేరదీసేది. వారు ఆమెను తల్లివలె ప్రేమించేవారు. ఆమె తల్లివలెనే కాక, స్నేహితురాలిగా, బోధకురాలిగా వారితో మెలిగేది. ఆమె ఎవరినీ క్రీస్తును అంగీకరించుమని ఒత్తిడి చేసెడిది కాదు. కాని ఆమె వద్ద నుండి క్రీస్తును తెలిసికొనినవారు, ఆమె యొక్క జీవితమును, ప్రేమను అనుభవపూర్వకముగా తెలుసుకొనిన అనేకులు క్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించిరి.

ఆలయములలో దేవదాసీలుగా వుంటూ బలవంతముగా పాప భరితమైన జీవితములోనికి ఈడ్చబడు అనేక ఆలయ బాలికలు, స్త్రీలు రామాబాయిచే రక్షించబడిరి. వారిలో అనేకులు శారదా సదనములో చేర్చబడిరి. ఒకమారు ఆమె ఒక బీద యాత్రికురాలివలె మారువేషము వేసుకొని బృందావనము అని పిలువబడు ప్రదేశములో పూజారుల వద్ద దాసీలుగా వున్న అనేకమంది బాలికలను, స్త్రీలను రక్షించి వారిని వెలుపలికి తీసుకొని రాగలిగెను. అటువంటివారు ఏ విధముగానైనా ఆ చెర నుండి తప్పించుకొని వచ్చిన, శారదా సదనము వారికి ఆశ్రయమివ్వగలదని ఆమె వారికి తెలియజేసింది.

ఆమె అనేక గ్రామములకు ఎడ్ల బండిపై వెళ్లి అక్కడి వారికి సువార్తను బోధించేది. అవసరమైన వారికి ఆహారమును, దుస్తులను పంచిపెట్టేది. ఈ పరిచర్య అంతటికిని కావలసిన ధనముకై ఆమె దేవునిపై మాత్రమే ఆధారపడేది. ఆమె అనేక ఆలయ బాలికలను కాపాడినందులకు హిందూ పూజారులు ఆమెపై ఆగ్రహించి ఆమెను వ్యతిరేకించారు.

ఒకమారు గుజరాత్ నకు  చెందిన ఒక బాలిక దుష్టాచారులు వద్దనుండి రక్షించబడి బొంబాయిలోని ఒక హాస్పిటల్లో చేర్పించబడింది. వారు ఆమెను కనుగొని తిరిగి తమతో రావలసినదిగా బలవంతపెట్టారు. కాని, ఆ బాలిక అట్లు వెళ్లినచో వారు కొట్టు దెబ్బలకు భయపడి వెళ్లుటకు నిరాకరించింది. వారు ఆమె తప్పించుకొని పోకుండ దివారాత్రములు హాస్పిటల్ చుట్టూ కాపలా కాసారు. కాని రామాబాయి ఒక స్నేహితురాలి సహాయముచే ఆ బాలిక తప్పించుకొని శారదా సదనము చేరగలుగునట్లుగా చేసింది.

రామాబాయి యొక్క కీర్తి ఇండియా అంతటా మరియు యితర దేశములకునూ వ్యాపించింది. సరోజినీ నాయుడు వంటి భారత నాయకులు ఆమెను గుర్తించి భారతదేశపు గొప్ప బిడ్డగా అభివర్ణించారు. యితర దేశముల వారునూ సహాయ సహకారములు అందించుట ప్రారంభించారు.


"ముక్తి మిషన్" ను స్థాపించుట:

రామాబాయి యొక్క సేవ వర్థిల్లుచూ శారదా సదనమును ఆశ్రయించువారికి స్థలము లేనంతగా విస్తరించింది. కనుక ఆమె పూనాకు సమీపములో ఖేడ్గావ్ అను ప్రాంతములో శారదా సదనము వలె నుండు మరియొక గృహమును నిర్మించి దానికి 'ముక్తి' అని పేరు పెట్టింది. దీనిని అభివృద్ధి చేయుటకై ఆమె ఎంతగానో ప్రార్థించింది. ఇక్కడికి వచ్చు బాలికలు కూడా ఏదో ఒక విద్యలో శిక్షణ పొందెడివారు. ఆ విధముగా వారు స్వయం ఉపాధిని పొందగలిగేవారు. వారిలో అనేకులు నర్సులుగా, నేత పనివారుగా, బైబిల్ టీచర్లుగా, గృహ సంరక్షకులుగా రూపుదిద్దబడ్డారు. ఒక బాలిక ముక్తి నుండి క్రొత్త జీవితమును ప్రారంభించుటకు బయటకు రాగానే వేరొకరితో ఆ స్థలము పూరించబడేది.

మధ్య భారతదేశములో గొప్ప కరువు వచ్చినది. అనేకులు ఆకలి బాధతో మరణింపసాగారు. రామాబాయి తన చిన్నతనములో కరువు బారిన పడిన సంఘటనలు జ్ఞప్తికి తెచ్చుకొని వారికి సహాయము చేయుటకై ముందుకు వచ్చింది. 300 మంది బాలికలు ఆమెచే సహాయము పొందుటకై వచ్చారు. ఆమె వారికి ఏమి చేయగలదు? అప్పటికే ముక్తి సదన్ కూడా నిండిపోయింది. ఆమె అవసరతల విషయమై బహుగా ప్రార్థించి. ఈ విషయమై అనేకులకు లేఖల ద్వారా విన్నవించింది. వెంటనే క్రైస్తవులు అనేకులు స్పందించి వారి సహాయమును పంపిరి. ఆ విధముగా ఆ బాలికలకు సరిపడు ధనమును ఆమె సకాలములో పొందగలిగింది.

ముగింపు:

రామాబాయి ఎప్పుడూ క్రొత్త పరిచర్యలో నిమజ్ఞమై యుండెడిది. ఆమె తరచుగా ప్రయాణించుచూ, బోధించుచూ గడిపెడిది. ఆమె మరాఠీ భాషలో అనేక పాటలను కూడా రచించింది. దీనకరమైన జీవితము నుండి ప్రారంభించి రెండు పెద్ద ఆశ్రమములను నెలకొల్పగలిగింది. ఒక్క ముక్తి ఆశ్రమములోనే రెండు వేల వరకు బాలికలు, స్త్రీలు ఆశ్రయము పొందగలిగారు. వంద మంది ఆమెకు సహాయకులుగా ఉండేవారు. 1922వ సంవత్సరము రామాబాయి ఈ లోకములో తనకిచ్చిన కార్యక్రమములు నెరవేర్చి ఆయన ఉన్నత బహుమతి పొందుటకై వెళ్ళిపోయింది. కాని, ఆమె పరిచర్య మిగిలే ఉన్నది. ఈ దినమున కూడా ముక్తి మిషన్ వారి ఆధ్వర్యమున నిరాశ్రయులైన ఎందరో బాల బాలికలు సహాయము పొందగలుగుచున్నారు. రామాబాయి యొక్క విజయము ఆమె పరిచర్య అనేకులను ఆశ్చర్యపరిచేది. ఒక బ్రాహ్మణ విధవరాలు తన స్వంత వారిచే వెలివేయబడినప్పటికిని దేవుని కొరకు, సమాజము కొరకు అంత సేవ ఏ విధముగా చేయగలిగింది? దాని రహస్యము ఏమనగా - ఆమె తన ఒక్కగానొక్క జీవితమును క్రీస్తు చేతులకు సమర్పించింది. ఆయన యిచ్చిన బలముతోనే సమస్తము సాధ్యమయ్యింది. రామాబాయి ఈ విధముగా పలికేది  - 'దేవుడు నాకు ఏమి చేసెనో, ఆయన మీకునూ ఆలాగున చేయగలరు'.






No comments:

Post a Comment

Quotes from Famous Scientists about God

  • Albert Einstein -Science without religion is lame, religion without science is blind.
  • Isaac Newton-I have never denied the existence of God. I think the universe is too complex and harmonious to be a result of chance.
  • Galileo Galilei-God is known by nature in his works, and by doctrine in his revealed word.
  • Johannes Kepler-To the Lord whom I worship and thank, That governs the heavens with His eyelid, I return, exalted at His command.

Today's Verse

Systematic Theology in Telugu

Visit Elselah Book House


Total Pageviews