"భూలోకపు రాజు ఇచ్చే పనిని గౌరవంగా పరిగణిస్తే, పరలోకపు రాజు ఇచ్చే పనిని త్యాగంగా ఎలా పరిగణిస్తావు?"
చీకటి ఖండంలో క్రీస్తు వెలుగును నింపిన మహనీయుడు
డేవిడ్ లివింగ్ స్టన్ 19 వ శతాబ్దానికి చెందిన స్కాటిష్ మిషనరీ, ఆఫ్రికా ఖండంలో అనేక ప్రదేశాలను కనుగొన్న అన్వేషకుడు మరియు వైద్యుడు. ఆఫ్రికా ఖండంలో బానిస వ్యాపారాన్ని రద్దు చేయటంలో, స్థానిక ఆఫ్రికన్ల హక్కులను కాపాడటంలో ఆయన చేసిన కృషి మరువలేనిది. ఆఫ్రికాలో లివింగ్ స్టన్ యొక్క సాహసయాత్రలలో 1854 లో నైలు నది యొక్క మూలాన్ని కనుగొనే ప్రయత్నం, విక్టోరియా జలపాతం మరియు ఆఫ్రికా ఖండం లోని అనేక మారుమూల ప్రాంతాలను అన్వేషించడానికి ఆయన చేసిన ఇతర ప్రయాణాలు ఉన్నాయి.
బాల్యం మరియు విద్యాభ్యాసం
డేవిడ్ లివింగ్ స్టన్ 1813లో స్కాట్లాండ్ లోని బ్లాంటైర్(Blantyre) అనే పట్టణంలో జన్మించాడు. లివింగ్ స్టన్ తల్లిదండ్రులు నీల్ లివింగ్ స్టన్ మరియు ఆగ్నెస్. వీరు కార్మిక తరగతికి చెందినవారు. అతని తండ్రి టీ డీలర్ మరియు ఆదివారం పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేసేవాడు. అతడు బైబిల్స్ మరియు క్రైస్తవ సాహిత్యాన్ని తన తీరిక సమయంలో పంచిపెట్టేవాడు. ఆయన వేదాంత శాస్రం మరియు మిషనరీ సంస్థల గురించిన పుస్తకాలను విస్తృతంగా చదివేవాడు. దీని ప్రభావంతో డేవిడ్ లివింగ్ స్టన్ బాల్యం నుండే ఆసక్తి గల పాఠకునిగా మారాడు. అతడు ప్రకృతి మరియు సైన్స్ కు సంబంధించిన పుస్తకాలు కూడా ఎక్కువగా చదివేవాడు. కాని సైన్స్ పుస్తకాలు క్రైస్తవ్యాన్ని అణగదొక్కుతాయని అతని తండ్రి భావించేవాడు. అతని తల్లి ఎంతో దైవ భక్తి కలిగిన స్త్రీ. ఎల్లప్పుడూ సౌమ్యత కలిగి సహనంతో ఉండేది. రెండు గదుల చిన్న యింటిలో ఏడుగురు కుటుంబ సభ్యులతో ఉండే వారి గృహాన్ని ఆమె సమర్థవంతంగా నిర్వహించేది.
డేవిడ్ స్థానిక ఐరిష్ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. తగినంత వయస్సు వచ్చిన వెంటనే అతను కుటుంబ పోషణకు సహకరించవలసి వచ్చింది. పదేళ్ళ వయస్సులో పత్తిమిల్లులో ఉదయం ఆరు నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు పనిచేసేవాడు. ఎనిమిది నుండి పది గంటల సమయంలో తెరచి ఉండే సాయంకాల పాఠశాలలో తన చదువును కొనసాగించాడు.
పరిమిత ఆర్ధిక వనరులు ఉన్నప్పటికీ లివింగ్ స్టన్ తన విద్యను కొనసాగాలని నిశ్చయించుకున్నాడు. మెడిసన్ మరియు కెమిస్ట్రీని అభ్యసించడానికి గ్లాస్గో లోని ఆండర్సన్ కళాశాలలో చేరాడు. కాంగ్రిగేషనల్ చర్చి పాస్టరు మరియు బానిసత్వ వ్యతిరేకంగా ప్రచారం చేసే రిచర్డ్ వార్డ్ లా యొక్క వేదాంత ఉపన్యాసాలకు హాజరవుతూ గ్రీకు భాషను కూడా అభ్యసించాడు. లివింగ్ స్టన్ సైన్స్ మరియు మెడిసన్ లో మంచి గుర్తింపు పొందాడు. 1840 లో గ్లాస్గో లోని ఫిజీషియన్స్ మరియు సర్జన్స్ ఆఫ్ ఫ్యాకల్టీ (రాయల్ కాలేజ్ ) లైసెన్స్ పొందాడు.
ఆఫికా దేశానికి మిషనరీగా పిలుపు
అతడు తన బాల్యం నుండి చైనా దేశానికి మెడికల్ మిషనరీగా వెళ్ళాలనే ఆశయాన్ని కలిగి ఉండేవాడు. దేవుడు తనను నడిపించకున్నా తన స్వయం పోషణతో చైనాదేశానికి వెళ్లాలని ఆశిస్తూ లండన్ మిషనరీ సొసైటీకి దరఖాస్తు చేసుకున్నాడు. కాని ఆ సమయంలో ఇంగ్లండ్ మరియు చైనా దేశాల మధ్య యుద్ధం కారణంగా చైనా ద్వారాలు మూసి వేయబడ్డాయి. అదే సమయంలో ఆఫ్రికా దేశంలో మిషనరీ పరిచర్య చేస్తున్న మోఫాట్ అనే మిషనరీ పిలుపుకు స్పందించి అక్కడ సేవలో పాల్గొనడానికి 1840 డిసెంబర్ 8న బయలుదేరాడు. 3 నెలల నౌకా ప్రయాణంలో అతడు నావికా శాస్త్రాన్ని కెప్టెన్ ద్వారా తెలుసుకున్నాడు. ఈ పరిజ్ఞానం అతనికి ముందు దినాలలో మధ్య ఆఫ్రికాను అన్వేషించుటలో ఎంతగానో సహాయపడింది.
కేప్ టౌన్ నుండి 600 మైళ్ళ దూరంలో గల రాబర్ట్ మోఫాట్ యొక్క ప్రఖ్యాత మిషనరీ స్థావరమైన కురుమాన్ కు చేరాడు. “ఉదయకాలం నేను నా యింటి వరండాలో నిలబడి ఉత్తరం వైపు చూసాను. యేసు క్రీస్తు గురించి ఎన్నడూ వినని వెయ్యి గ్రామాల నుండి తెల్లని పొగలు రావడం చూసాను. ఈ ప్రజలంతా క్రీస్తు లేకుండా, దేవుడు లేకుండా ప్రపంచంలో నిరీక్షణ లేకుండా ఉన్నారు” అని డేవిడ్ తెలిపాడు. ‘క్రీస్తు లేని వెయ్యి గ్రామాల నుండి పొగ’ ఈ మాటలను లివింగ్ స్టన్ ఎన్నడూ మరువలేదు. అతడు మిషనరీ స్థాపకుడైన రాబర్ట్ మోఫాట్ తో ఉత్తరాన ఉన్న ఈ వెయ్యి గ్రామాలను క్రీస్తు సువార్తతో సంధించాలనే తన ఆశయాన్ని తెలియజేసాడు. అతని అంగీకారంతో 1843 లో తన ప్రయాణాన్ని కొనసాగించి మబోట్సా (Mabotsa) అనే లోయ ప్రదేశానికి చేరాడు.
అతని మిషనరీ ప్రయాణాలలో ఒకమారు సింహం యొక్క దాడి నుండి తృటిలోతప్పించుకున్నాడు. ప్రక్కనే ఉన్న మెబాల్వే (Mebalwe) స్థానిక ఉపాధ్యాయుడు రక్షించకుంటే అతను మరణించేవాడు. కాని అతని ఎడమ ముంజేయి తీవ్రంగా గాయపడి జీవితాంతము బాధించింది.
మేరి మోఫాట్ తో వివాహము మరియు కుటుంబంగా పరిచర్య
మబోట్సా ప్రాంతంలో పరిచర్యను విజయవంతంగా ముగించుకొని కురుమాన్ స్థావరానికి తిరిగివచ్చాడు డేవిడ్. అతడు సింహం దాడి యొక్క గాయాల నుండి కోలుకున్న పిమ్మట మేరీ మోఫాట్ తో అతని వివాహం జనవరి 9, 1845 లో జరిగింది. వారిరువురు మబోట్సా నందు ఒక సవత్సరం పాటు సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడిపారు. ఆ తరువాత వారు కోలోబెంగ్ (Kolobeng) అను ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో గడిపిన దినాలు తన జీవితంలో ఆనందకరమైన క్షణాలుగా పేర్కొంటాడు కాని తన బిడ్డలతో ఎక్కువ సమయం గడపలేకపోయాననే వేదన అతనికి ఉండేది. ఆ ప్రాంతంలో ఉండే బక్వేయిన్స్ (Bakwains) జాతి నాయకుడు ‘సెచెలె’ క్రీస్తు సువార్తకు స్పందించాడు. “మీ పితరులు మా పితరుల వద్దకు వచ్చి ఈ సువార్తను ఎందుకు బోధించలేదు? ఈ సువార్తను ఎందుకు మీతోనే ఉంచుకున్నారు?” అని ప్రశ్నించాడు. అతడు క్రీస్తును తన స్వంత రక్షకునిగా స్వీకరించాడు.
వారు ఆ ప్రదేశం విడచి కలహారి ఎడారికి ఉత్తరాన ఉన్నజాంబేజీ ప్రాంతానికి తరలి వెళ్లారు. ఈ ప్రాంతం కేప్ టౌన్ కు దాదాపు 1500 మైళ్ళ దూరంలో ఉంది. ఆ తర్వాత లివింగ్ స్టన్ తన భార్య మరియు నలుగురు పిల్లలను స్కాట్లాండ్ కు పంపించాడు. 1852లో లివింగ్ స్టన్ ఆఫ్రికా ఖండాన్ని అన్వేషించడానికి తన యాత్రను ప్రారంభించాడు.
లివింగ్ స్టన్ యొక్క సాహసయాత్రలు మరియు అన్వేషణలు
1851లో దక్షిణ ఆఫ్రికాలోని కలహరి ఎడారిని అన్వేషించి నగామి(Ngami) సరస్సును కనుగొన్నాడు. రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ వారిచే అన్వేషకునిగా గుర్తించబడ్డాడు.
1853లో ఎగువ జాంబేజీ నదిపై పరిశోధనకు నాయకత్వం వహించాడు. అక్కడ ఉన్న ఉన్న లిన్యాంటి గ్రామానికి వెళ్ళాడు. ఇక్కడ ఉన్న కోలోలో జాతి నాయకుని సహాయంతో తీరానికి వాణిజ్య మార్గాలను పరిశోధిస్తూ పోర్చ్ గీస్ నగరం లువాండా చేరుకున్నాడు.
1854లో లిన్యాంటి గ్రామానికి తిరుగు ప్రయాణంలో మోసి-ఓ-తున్యా (ఉరుములు మెరుపుల పోగ) జలపాతాన్నికనుగొన్నాడు.
1855 లో విక్టోరియా జలపాతం కనుగొనడంతో సహా 1858-1864 లో అతను ప్రస్తుత జాంబియా, అంగోలా మరియు టాంజానియా ప్రాంతాన్ని అన్వేషించాడు. విక్టోరియా జలపాతాన్ని చూసిన మొదటి యూరోపియన్ లివింగ్ స్టన్, దానికి విక్టోరియా రాణి పేరు పెట్టాడు మరియు ఆఫ్రికా ఖండం యొక్క వెడల్పును దాటిన మొదటి వ్యక్తి కూడా లివింగ్ స్టన్.
1866-1873 లో తన చివరి పరిశోధన యాత్రలు చేసాడు, పాశ్చాత్య భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన అనేక అన్వేషణలు చేశాడు. ఆఫ్రికా ఖండంలోని అనేక ప్రాంతాలను, నదులను కనుగొన్నాడు.
అతని సాహసాలు మరియు ఆవిష్కరణలకు లివింగ్ స్టన్ కు అనేక పతకాలు లభించాయి, వీటిలో 1857 లో రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఫౌండర్స్ గోల్డ్ మెడల్ మరియు 1864 లో రాయల్ సొసైటీ ఆఫ్ ఎడిన్ బర్గ్ యొక్క బ్రూస్ మెడల్ ఉన్నాయి. అతను 1864 లో రాయల్ సొసైటీ ఫెలోగా కూడా నియమించబడ్డాడు.
డేవిడ్ లివింగ్ స్టన్ మరణం
డేవిడ్ లివింగ్ స్టన్ 60 సంవత్సరాల వయస్సులో 1873 మే 1 న ప్రస్తుత జాంబియాలోని బాంగ్ వేలు సరస్సుకి ఆగ్నేయంగా ఉన్న చిటంబో గ్రామంలో తన చివరి దినాలు గడిపాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మలేరియా మరియు అంతర్గత రక్తస్రావం కారణంగా మరణించాడు. అతని నమ్మకమైన అనుచరులు చుమా మరియు సుపీ నేతృత్వంలో అంత్యక్రియలను జరిపించారు. వారు అతని గుండెను తీసివేసి అతడు మరణించిన ప్రదేశానికి సమీపాన గల చెట్టు క్రింద పాతిపెట్టారు. ఆ ప్రాంతం ప్రస్తుతం లివింగ్ స్టన్ మెమోరియల్ స్థలముగా పిలువబడుచున్నది. అతని మృతదేహం మరియు ఆయన పుస్తకాలు , ఉపయోగించిన వస్తువులు బ్రిటన్ కు పంపారు. లండన్ లోని రాయల్ సొసైటీ ప్రధాన కార్యాలంలో ఉంచబడిన పిమ్మట వెస్ట్ మినిస్టర్ అబ్బే లో ఖననం చేశారు.
ముగింపు
లివింగ్ స్టన్ రచనలు మరియు పత్రికలు బానిసత్వ నిర్మూలనకు మద్దతు నిచ్చాయి. ఆయన అన్వేషణలు బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణపై గొప్ప ప్రభావం చూపింది. ఆఫ్రికన్లకు విద్య మరియు ఆరోగ్య సంరక్షణ లభించడానికి అతని అన్వేషణలు తోడ్పడ్డాయి. ఆయన క్రైస్తవ మిషనరీలు అంకిత భావంతో పనిచేయడాన్ని ప్రోత్సహించాడు. అతను తన జర్నల్ లో ఇలా వ్రాశాడు –“ క్రీస్తు రాజ్యానికి సంబంధించి తప్ప, నాకు కలిగి ఉన్న దేనికీ విలువ ఇవ్వను. ఏదైనా రాజ్యం యొక్క ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్ళాలంటే , ఇవ్వడం లేదా ఉంచడం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. నిత్యత్వంలో నేను నిరీక్షిస్తున్న రాజ్యం యొక్క కీర్తిని చాటడానికి నేను ఎల్లప్పుడూ ఋణపడి ఉంటాను”. డేవిడ్ లివింగ్ స్టన్ జీవితం ద్వారా ఉత్తేజితులై ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది యవ్వనులు మిషనరీలుగా క్రీస్తు సేవకు సమర్పించుకున్నారు. ఇంకనూ క్రీస్తును ఎరుగని ప్రాంతాలకు వెళ్లి సువార్త ప్రకటించడానికి ఇదే మంచి తరుణం. ప్రయాస పడదాం, భూదిగంతాలకు దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ముందుకు కదులుదాం.