బాల్యం
పాస్కల్ ఫ్రాన్స్ దేశంలోని క్లెర్మాంట్- ఫెరాండ్ (Clermont – Ferrand) అనే స్థలంలో 1623 వ సంవత్సరంలో జన్మించాడు. అతని తల్లి ఆంటోనెట్ బెగాన్ (Antoinette Begon). అతనికి మూడేళ్ళ వయస్సు ఉన్నప్పుడే ఆమె మరణించింది. అతని తండ్రి ఎటిన్ పాస్కల్ (Etiene Pascal) కూడా గణితశాస్త్రమంటే ఎంతో మక్కువ గలవాడు. ఆయన స్థానిక న్యాయస్థానంలో కూడా సభ్యుడిగా ఒక గౌరవనీయమైన స్థానం కలిగి ఉండేవాడు. పాస్కల్ కు ఇద్దరు సహోదరీలు గిల్మర్ట్ (Gilberte) మరియు జాక్విలిన్ (Jaquline). తన భార్య మరణించిన 5 సంవత్సరాల తరువాత ఎటిన్ పాస్కల్ కుటుంబంతో సహా పారిస్ నగరానికి వచ్చాడు. ఆయన తన పిల్లల పోషణ భారాన్ని తానె చూసుకోవాలనే తలంపుతో పునర్వివాహం చేసుకోలేదు. వారందరు చిన్నతనం నుండే బాలమేధావులు గా ఎంతో ప్రతిభను కనబర్చేవారు. ముఖ్యంగా బ్లెయిజ్ గణిత శాస్తం మరియు విజ్ఞాన శాస్త్రం లో అధికమైన అభిరుచిని కలిగియుండేవాడు.
పిల్లవాడిగా పాస్కల్ కు ప్రతీ విషయం తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండేది. ఏదైనా ఒక అద్భుత విషయాన్ని చూస్తే నవ్వి , ఉదాసీనంగా ఉండేవాడు కాదు. అది ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు. తన కుమారుని మేధా పటిమను చూసి తండ్రి ఆశ్చర్యపోయేవాడు. గణిత శాస్త్రం జోలికి పాస్కల్ ను వెళ్ళనీయకూడదని తలంచాడు. గణిత శాస్త్ర అధ్యయనం మనసును నిర్భందించి, వశపరచుకొని మిగతా వాటి మీద ధ్యాస లేకుండా చేస్తుందని ఆయన భయపడేవాడు. అందుకే లాటిన్ మరియు ఇతర భాషల లోని కఠిన మైన పాఠాలను నేర్చుకొనే ఏర్పాటు చేసి గణిత శాస్త్ర అధ్యయనానికి సమయం లేకుండా చేసేవాడు. కాని బ్లెయిజ్ యొక్క సహజసిద్దమైన కోరిక , జిజ్ఞాస వాటినన్నిటిని అధిగమించింది.
ఆవిష్కరణలు
పాస్కల్ తన 16 వ ఏటనే కోనిక్ సెక్షన్స్ ను రచించాడు. ఆర్కిమెడిస్ కాలం తరువాత గణిత శాస్త్రంలో జరిగిన విశిష్టమైన రచన ఇదే అని ఫ్రెంచ్ దేసస్తులంతా అతనిని కీర్తించారు. ఆ తరువాత అతడు కాలిక్యులేటింగ్ మెషీన్ కనుగొన్నాడు. మూడు సంవత్సరాలు పరిశోధన చేసి 50 నమూనా యంత్రాలను, పాస్కలైన్ కాలిక్యులేటర్స్ అని పిలువబడే 20 యంత్రాలను అతడు రూపొందించాడు.
పాస్కల్ తన మేధా పటిమతో వాయువుకు బరువు ఉంటుందని, మెర్క్యురీ లెవల్ వాతావరణానికి అనుగుణంగా మారుతుందని కనిపెట్టాడు. దీని ఫలితంగానే సెప్టెంబర్ 19, 1648 లో అతడు ‘బారోమీటర్’ ను ప్రపంచానికి అందించాడు. అప్పటికి పాస్కల్ వయస్సు 20 ఏళ్ళు. ఆ తరువాత అతడు ఎన్నో ప్రయోగాలు చేసి అనుదినం జీవితానికి అవసరమయ్యే అనేక క్రొత్త విషయాలను కనుగొన్నాడు.
మతం పై ఆసక్తి
1646 లో పాస్కల్ యొక్క తండ్రి జారిపడటంతో ఆయన తుంటి ఎముక విరిగింది. చికిత్స చేయుట కొరకు ఆ దేశంలో ప్రసిద్ధులైన ఇద్దరు వైద్యులు వారి గృహానికి వచ్చేవారు. వారిరువురు కాథలిక్ బోధలలో నిష్ణాతులు. వారితో తరచూ సంభాషిస్తూ బ్లెయిజ్ కూడా కాథలిక్ మతబోథల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆ సమయంలో ఆయన అగస్టీన్ స్థాపించిన శాఖకు పరిచయమయ్యాడు. ఇది అతనిలో జరిగిన మొదటి మార్పుగా పాస్కల్ భావించేవాడు. ఆ తరువాత అతడు కొద్దికాలం పూర్తిగా ప్రక్కకు తొలిగి (1648 – 1654) మధ్యకాలంలో లోకానుసారమైన జీవితం జీవించాడు. 1651లో అతని తండ్రి మరణించాడు. ఒక సోదరి వివాహం చేసుకొని తన భర్తతో వేరొక ప్రదేశానికి వెళ్ళింది. తన చెల్లెలు జాక్విలిన్ఆస్తినంతా పాస్కల్ కు రాసి సన్యాసినిగా పోర్ట్ రాయల్ అనే ప్రదేశానికి వెళ్ళిపోయింది. ఈ సంఘటన పాస్కల్ ను ఎంతో కృంగదీసింది. అతడు పూర్తిగా ఒంటరి వాడయ్యాడు. అతడు ఇహలోక వ్యాపారంలో చిక్కుకొని దేవునికి దూరమయ్యాడు.
పునర్జన్మ
1654 నవంబర్ 23 సోమవారం పాస్కల్ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. రాత్రి కాల సమయంలో 10.30 నుండి 12.30 గంటల మధ్య అతనికి ఒక దర్శనం కలిగింది. ఆ రాత్రి నిద్రపట్టక బైబిల్ చదువుతూవుండగా అకస్మాత్తుగా ఒక అగ్ని జ్వాల తనను చుట్టివేయడం గమనించాడు. మిరుమిట్లు గొలిపే కాంతికి అతని కళ్ళు మసకబారి పోయాయి. ఆ అద్భుతమైన ఘడియ మాటలలో వివరించలేనిదని అంటాడు పాస్కల్. ఒక అనూహ్యమైన శక్తి అతనిని ఆవరించింది. అతనిలో ఒక వింత ప్రక్రియ ప్రారంభమయ్యి అతని అభిరుచులను ఇష్టాలను రూపుమాపి ఒక నూతన వ్యక్తిగా మార్చింది. దైవ కృప ఆయన హృదయం లోకి వచ్చి గొప్ప కార్యాన్ని చేసింది. తన సోదరి స్వార్ధ రహిత జీవితం కూడా అతడిని తన్మయుడిని చేసింది. అతడు కొంతకాలం తన వైజ్ఞానిక పరిశోధనలన్నీ ప్రక్కన పెట్టి ప్రభువు తనతో మాట్లాడిన ‘ అవసరమైన దానిని ‘ వెదకడం ప్రారంభించాడు. ఈ ఉన్నతమైన అన్వేషణకు తనను తాను అంకితం చేసుకున్నాడు.
పాస్కల్ తన పునర్జన్మ అనుభవాన్ని ఇతరులతో పంచుకునేందుకు అనువుగా వెంటనే ‘ ఆన్ ద కన్వర్షన్ ఆఫ్ ద విన్నర్’ అనే పుస్తకాన్ని రాసాడు . “ నా జనులు రెండు నేరములు చేసియున్నారు. తమ కొరకు జీవ జలముల ఊట అయిన నన్ను విడిచి యున్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్ళు నిలువని తొట్లను తొలిపించుకొని యున్నారు” (యిర్మియా 2:13) అనే వచనం ద్వారా దేవుడు తనతో మాట్లాడినట్లు పాస్కల్ తెలియజేసాడు. ఈ మాటలు పాస్కల్ మనస్సులో కలవరం లేపాయి. తానూ బుద్దిపూర్వకంగా ప్రభువు తట్టు తిరిగి నీళ్ళు నిలవని బద్దలైన తొట్లు అనగా కేవలం విజ్ఞాన జీవితంలోనే నిమగ్నమై పరలోకాన్నే మర్చిపోయే అల్పత్వంలో ఉన్నానని గుర్తించాడు. ఆయన పాదాల దగ్గర వదిలిపెట్టిన యే జీవజీల ఊటనైతే (యేసును) ఇంతకాలం వదిలేశాడో ఆ విమోచకుడిని ఆశ్రయించాడు. ఆ దినం నుండి తానూ మరణించేవరకు యేసే సర్వస్వంగా బ్రతికాడు పాస్కల్.
పాస్కల్ రచనలు
1656- 57 మధ్యకాలంలో పాస్కల్ అనేక రచనలు చేసాడు. కాథలిక్ మత పద్ధతులను ఎన్నిటినో పాపపు ఆచారాలుగా కొట్టివేసాడు. అతడు రాసిన 18 ఉత్తరాల సంపుటి ‘ప్రొవిన్షియల్ లెటర్స్’ ఎంతో ప్రాచుర్యం పొందింది. అతని రచనలు ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయితలైన వోల్టేర్,రూసో లను కూడా ప్రభావితం చేశాయి. క్రైస్తవ విశ్వాసాన్ని పెంపొందిచుటకు ‘పెన్సిస్’ అని పిలువబడే గ్రంథాన్ని పాస్కల్ రచించాడు . ఇది అతని మరణానంతరం ముద్రించబడింది. తన సహోదరిని తిరిగి రావలసినదిగా విజ్ఞాపన చేస్తూ ఆయన రాసిన రచనలు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి.
వైజ్ఞానిక సంబంధమైన అనేక పరిశోధనలతో కూడిన రచనలు చేశాడు పాస్కల్. ‘ఎస్సేస్ ఆన్ కోనిక్స్’ మరియు ‘న్యూ ఎక్స్పెరిమెంట్ విత్ ద వ్యాక్యుం’ మొదలగు గణిత శాస్త్రం మరియు పదార్ధ శాస్త్రాలకు సంబంధించిన అనేక ఆవిష్కరణలకు సంబంధించిన రచనలను చేశాడు పాస్కల్. 1662 లో పారిస్ నగరంలో యంత్రాలతో నడిచే మొట్ట మొదటి పబ్లిక్ బస్ లైన్ ను నడిపించి యాంత్రిక రంగంలో తనలోని మేధా పటిమను ప్రపంచానికి తెలియజేశాడు. అతని ఆవిష్కరణలతో నాగరిక ప్రపంచానికి బాటలు వేశాడు పాస్కల్
ముగింపు
1662 ఆగష్టు 19 న తీవ్ర అనారోగ్యానికి గురై తన 39 వ ఏట ప్రభువు సన్నిధికి చేరాడు పాస్కల్. తన అంతం దగ్గర పడుతున్నప్పుడు ‘నా కోసం శ్రమ పొంది చనిపోవడానికి వచ్చిన విమోచకుడి వైపు నా చేతులు చాపుతున్నాను’ అని పలికాడు. ‘ దేవుడు నన్నెన్నడు విడిచిపెట్టడు’ అన్న అతని చివరి పలుకులు అతని సమాధి మీద చెక్కబడ్డాయి. ఫ్రాన్స్ చరిత్రలో అనేక మంది గొప్ప వ్యక్తులు జన్మించారు కాని వారందరిలో విశిష్టమైన వ్యక్తిగా తన కాంతిని విశ్వమంతటా వెదజల్లాడు పాస్కల్.