Tuesday 5 March 2024

మదర్ థెరీసా (1910-1997)

 


“ఎదుటివారిని చూసి ప్రేమ పూర్వకంగా నవ్వగలిగితే, అదే వారికి నువ్విచ్చే అందమైన బహుమతి “

మదర్ థెరీసా చిన్న వయస్సులోనే , భారతదేశంలో నన్ గా సేవలందించుటకు తాను పిలువబడ్డానని గ్రహించారు. 1946 వ సంవత్సరములో కలకత్తాలో నివసిస్తూ బోధన వృత్తిని కొనసాగిస్తున్న ఆమె కలకత్తాలోని అత్యంత దయనీయ స్థితిలో ఉన్న బీదవారి మధ్య నివసించి వారికి ఉచిత సేవలను అందించాలని “తన పిలుపులోనే మరొకపిలుపు” ను ఆమె పొందుకున్నారు. ఆమె భారత దేశానికి వచ్చి తన జీవితాంతం వరకు అట్టడుగు స్థితిలో ఉన్న బీద ప్రజలకు, అనాధలకు, అనారోగ్యంతో ఉన్నవారికి  చేసిన సేవ మరుపురానిది.

స్కోపే నగరంలో బాల్య జీవితం :

అది సెర్బియా లోని స్కోపే నగరం. అక్కడ ఆల్బేనియాకు చెందిన కుటుంబాలు అనేకం నివసించేవి. బోయాజీన్ కుటుంబం కుడా అందులో ఒకటి. అక్కడి ప్రజలు టర్కిష్ మరియు సెర్బోక్రొయేషియన్ భాషలు మాట్లాడేవారు. ఆల్బేనియన్లు మాత్రం ఇంట్లో ఆల్బేనియన్ భాషనే మాట్లాడేవారు. బోయాజీన్లు  ఈస్టర్న్ అర్థడాక్స్ క్రిస్టియన్లుగా  పిలువబడే కేథలిక్ లు. స్కోపే లో అనేకులు ముస్లింలు కూడా ఉండేవారు. ఆ నగరంలో మసీదులు, ఎత్తయిన మినారేట్లు ఎక్కువగా ఉండేవి.

నికోలాయ్ బోయాజీన్ మరియు డ్రేనాఫిల్ దంపతులు స్కోపేలో స్థిరపడ్డారు. నికోలాయ్ , మోర్టేన్ అనే ఒక ఇటాలియన్ వ్యక్తితో కలిసి వ్యాపారం చేసేవాడు. తినుబండారాలు, వస్తువులు, లెదర్ సామానులు మొదలగు వాటిని కొనుగోలు చేసి అమ్మేవారు. వారికి ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె అగాథా, కుమారుడు లాజర్ మరియు చిన్న కుమార్తె గోన్జా. వారు ఆతిథ్యం ఇవ్వడంలో ముందుండేవాళ్ళు. అతిథులను రంజింపజేయడానికి పాటలు పాడేవాళ్ళు. వాయిద్యాలను వాయించేవాళ్ళు. వారి ఇంటికి వచ్చే అతిథులు కొందరు మురికిగా ఉండేవారు. వారి నుండి దుర్వాసన వచ్చేది. కొందరికి ఆహారాన్ని , వస్త్రాలను తరచుగా ఇచ్చేవారు. తన చిన్న కుమార్తె గోన్జాతో తల్లి ఈ విధంగా చెప్పేది. “యేసు ఈ విధంగానే గాయాలతో బాధపడ్డాడు గోన్జా, ఇటువంటి ప్రజలకు నీవు సహాయం చేస్తే యేసయ్యకు సహాయం చేసినట్టే “

గోన్జా అనగా ఆల్బేనియన్ భాషలో “పూ మొగ్గ “ అని అర్థం. ఆమె తల్లి తన చిన్న కూతురుని ఎంతో ముద్దుగా గోన్జా అని పిలుచుకునేది. గోన్జా యేసు ఈలోకానికి పసిబిడ్డగా అవతరించిన కారణంగా వచ్చిన ఆనందాన్ని గూర్చి ఆలోచించేది. ఆయన సిలువ వేయబడిన విషయం గూర్చి చింతించేది. ఆరేళ్ళ వయస్సులో అక్కడి చర్చ్ ఆఫ్ సేక్రేడ్ హార్ట్ కు చెందిన బడికి వెళ్ళేది. చిన్నప్పటి నుండే ఆల్బేనియన్, సెర్బో క్రొయేషియన్, టర్కిష్ , ఫ్రెంచ్ మరియు ఇటాలియన్ భాషలు మాట్లాడేది. గోన్జా కవితాత్మకముగా ఉండేది. కథలు రాసేది. అగాథా ఎక్కువ తెలివి గలది. లాజర్ తన తండ్రి వలె ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు.

వారు నివసించే ప్రాంతంలో యుద్ధాలు సర్వసాధారణంగా జరుగుతుండేవి. తమ పాత శత్రువైన టర్కీకి వ్యతిరేకంగా సెర్బ్ లు, అల్బేనియన్లు పోరాడేవారు. గోన్జా తండ్రి యుద్ధసమయంలో మరణించాడు. రాజకీయంగా అతనికి విషం ఇచ్చి చంపారని గోన్జా విన్నది. రాజకీయాలు ఎంత ప్రమాదకరమైనవో గోన్జాకు అర్థం అయ్యింది. తన తండ్రి యొక్క వ్యాపారాన్ని ఆర్ధిక అవసరాల నిమిత్తం  తల్లి కొనసాగించింది. స్వయంకృషి తో వ్యాపారాన్ని ఆమె త్వరగానే అభివృద్ధి చేసింది. ప్రతి వ్యక్తీ కూడా సాధారణంగా ఇతరులు ఊహించే దానికన్నా ఎంతో తెలివైనవారు మరియు విలువైనవారు అనే సత్యాన్ని ఆమె తల్లిని చూసి తెలుసుకున్నది.  “పేదవాళ్ళు కూడా విలువైన వారే, దేవుని దృష్టిలో వస్తు సంపదకు అసలు విలువ లేదు” అని నమ్మింది గోన్జా. తాను పెద్దయిన తరువాత ఒక ఉపాధ్యాయురాలిగా కావాలని తలంచేది.

గోన్జా చదువులో , చర్చి కార్య కలాపాల్లో ముందుండేది. స్కూల్ లో తానే టాప్ స్టూడెంట్. ఆమె ముఖం ఎత్తయిన నుదురు, మెరుస్తున్న కళ్ళతో ఎంతో తేజస్సుతో ఉండేది. ఆమె ఇంటి పని చేసేది. ఖాళీ సమయాలలో అమ్మతో కలిసి పేదలను దర్శించేది. చర్చి ఫంక్షన్లలో అక్కతో కలిసి పాటలు పాడేది. స్నేహితులతో ఆటలాడేది. పుస్తకాలు మరియు పద్యాలు వ్రాసేది.

ఒకనాడు వారి చర్చి ఫాదర్ ఇగ్నేషియస్ లయోలా మాటలను గోన్జాకు గుర్తు చేశారు . “నేను క్రీస్తు నిమిత్తం ఏమి చేసాను? క్రీస్తు కొరకు నేను ఏమి చేస్తున్నాను? క్రీస్తు కొరకై నేను ఏమి చేయబోవుచున్నాను? “. గోన్జాను అవి ఎంతో ఉత్తేజపరిచాయి. చర్చికి సంబంధించిన బృందంతో కలిసి నూతన కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనసాగింది.

“సహాయం చెయ్యడానికి ఉండాల్సింది డబ్బు కాదు, మంచి మనస్సు”

భారతదేశానికి మిషనరీగా ప్రయాణం :

భారతదేశం గురించి కథలు కథలుగా విన్నా గోన్జాకు ఆ దేశమంటే ఎంతో యిష్టం కలిగింది. అనేక భాషలు, అనేక మతాలు, భారీ సంఖ్యలో ప్రజలు అంతేకాకుండా వారు పడుతున్న వేదన. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఆధీనంలో భారతదేశం ఉండేది. 1600 సంవత్సరం నుండి బ్రిటిష్ ఆధిపత్యం అధికమయ్యింది. 1800 సంవత్సరం చివరకు అనేకమంది విద్యావంతులైన భారతీయులు కలిసి ఒక జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. గోన్జాకు బెంగాల్ ప్రాంతం ఎంతో ఇష్టమైనది. భారతదేశాన్ని గూర్చి తనకు దొరికిన సమాచారాన్ని అంటా చదివింది. ఆమెకు దేవుడు భారతదేశానికి రమ్మంటున్నాడని అర్థమయ్యింది. కాని ఇంట్లో అమ్మ మరియు అక్క, సోదరుడు దీనిని సమర్థించలేదు. ఆమె యవ్వనస్తురాలైనప్పటికీ  అయిదు అడుగుల ఎత్తు తో చూడటానికి  చిన్న పిల్లలా ఉండేది. నలభై కేజీల బరువు కూడా ఉండేది కాదు. భారతదేశానికి మిషనరీగా వెళ్ళడం అంటే తన కుటుంబంతో పూర్తిగా వేరుపడటమే. కాని ఆమె తల్లి చివరకు విచారంగా “గోన్జా, నీవు వెళ్ళవచ్చు , నా దీవెనలు ఎల్లప్పుడూ నీకు ఉంటాయి. కాని దేవుని కొరకు, క్రీస్తు కొరకు మాత్రమే జీవించుటకు ప్రయాసపడు” అని ఆమెను దీవించింది.

1928 వ సంవత్సరం సెప్టెంబర్ 26 న గోన్జా భారతదేశానికి బయలుదేరింది. ఆమె ఎక్కిన రైలు యుగోస్లోవియా మీదుగా పారిస్ కు చేరింది. ఈ మధ్యలో మరో సిస్టర్ బెటికే తోడయ్యింది. పారిస్ నుండి వారు  ఐర్లాండ్ వెళ్ళే ఓడలో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో వారికి కొన్ని ఇంగ్లీషు పుస్తకాలు ఇవ్వబడ్డాయి. గోన్జా ఇంగ్లీషు భాషలో ప్రార్ధించడం కూడా నేర్చుకుంది. 1929 వ సంవత్సరం క్రిస్మస్ సమయంలో వారు సిలోన్ కు చేరారు. ఆ తరువాత కొన్ని దినాలకు మద్రాసు చేరారు. అక్కడ ఆమె చూసిన దారిద్ర్యం ఎన్నడూ ఊహించనిది. తాటాకులతో అల్లబడిన చాపలపై కుటుంబాలు వీధులలోనే నివసిస్తున్నారు. బురదనేల  మీద నివాసముంటున్నారు. వారికి ఒంటి మీద గుడ్డలు కూడా సరిగా లేవు. ముక్కులకు, చెవులకు ఆభరణాలు ధరించారు. భారతదేశం అంటే ఇదన్నమాట అని తన తోటి సిస్టర్ బెటికే తో అన్నది గోన్జా. జనవరి 6న వారు హుగ్లీ నది ఒడ్డునకు చేరారు. తనకిష్టమైన బెంగాల్ నెల పై అడుగుపెట్టినందుకు గోన్జా ఎంతో సంతోషించింది. 1929 వ సంవత్సరం మే 24 న గోన్జా మరియు బెటికే లను నన్స్ గా అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం డార్జిలింగ్ లో జరిగింది. గోన్జా ను సిస్టర్ మేరి థెరీసా గా బెటికే ను సిస్టర్ మేరీ మగ్ధలేనే అని నామకరణం చేశారు. వారిరువురు హ్యాబిట్ అనబడే వాదులు వస్త్రాన్ని ధరించి భుజాల క్రింద వరకు తెల్లటి కాలర్ ధరించాలి. తల పై తెల్లని ముసుగు ధరించి దేవదూతల వలె కనిపించసాగారు. వారికి రెండు సంవత్సరాల పాటు శిక్షణ నిచ్చారు. దైవిక సారాంశాలను జ్ఞాపకముంచుకొని బయటకు వల్లేవేయుటను అలవాటు చేసుకున్నారు. బైబిల్ లోని చిన్న వచనములు, కీర్తనలు, పాఠాలు, త్యాగధనుల జీవిత గాథలు వంటి కథనాల కూడికే ఈ దైవిక సారాంశాలు. 1932 వ సంవత్సరంలో తన కుటుంబం నుండి ఒక లేఖను అందుకున్నది సిస్టర్ థెరీసా. తన తల్లి స్కోపే నగరంలోనే ఒంటరిగా నివసిస్తున్నదని మరియు తన అక్క అగాథా సహోదరుడు లాజర్ తిరానా లో నివసిస్తున్నారని , తన తల్లి తానూ చేస్తున్న పని పట్ల ఎంతో సంతోషిస్తున్నట్లుగా తెలుసుకున్నది.

ఆ దినాలలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయుల పోరాటం ఎంతో ఉధృతంగా జరుగుతూ ఉండేది. నాయకుడైన గాంధీని, ఇతర జాతీయ కాంగ్రెస్ నాయకులను చెరసాలలో పెట్టారు. గాంధీ యొక్క వ్యక్తిత్వం థెరీసాను ఆకట్టుకునేది. ఆయనకు కొండ మీడి ప్రసంగం అంతా కంఠతా వచ్చు. “లీడ్ కైండ్లీ లైట్ “అంటూ తానూ ఇష్టపడే క్రైస్తవ గీతాన్ని ఆయన తరచూ పాడుతూ వుంటారు. ఆయన ఒక బలమైన నైతిక శక్తి. ఆ దినాలలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తే కోట్లాది భారతీయులు ఆయనకు మద్దతుగా బ్రిటిష్ వారిపై తిరగబడ్డారు. ప్రపంచంలో కూడా సరియైన పరిస్థితులు లేవు. జర్మనీలో నాజీ పార్టీ నాయకుడు హిట్లర్ దుష్ట కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. పోప్ ఉండే ఇటలీ దేశంలో కూడా పరిస్థితులు సమాధానంగా లేవు. ఇటువంటి  పరిస్థితులలో థెరీసా తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోతే తానొక సామాన్య క్రీస్తు సేవకురాలిగా మిగిలిపోతానని అర్థం చేసుకుంది. బెంగాలీ భాషను కష్టపడి నేర్చుకుంది. ఒక బెంగాలీ స్కూల్ లో చరిత్ర, , భూగోళ శాస్త్రాలను బోధించడం ప్రారంభించారు. 1935 వ సంవత్సరంలో 20 సంవత్సరాల వయస్సు వున్న సిస్టర్ థెరీసా తన బోధనలలో తీరికలేకుండా ఉన్నప్పటికీ అనేకమంది ఇతర నన్ లకు తమ పరీక్షలలో సహాయం చేసింది. వీటితో పాటు రోగులకు కూడా సేవలందించింది. థెరీసా తన చుట్టూ దారిద్ర్యంలో ఉన్న పేదప్రజలు ఏవిధంగా సహాయపడాలి అని ఎల్లప్పుడూ వారి విషయమై మథనపడేది.

1939 నుండి 1944 వరకు అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. 1945 లో ఊహించని పరిణామాలు జరిగాయి అప్పుడు జరిగిన హిందూ ముస్లిం ఘర్షణలలో ఒక్క కలకత్తా నగరంలోనే వేలాదిమంది మరణించారు. ఆ సమయంలో డార్జిలింగ్ కు సదస్సు నిమిత్తం పయనమయిన థెరీసా కు ఒక స్వరం వినిపించింది. “బీదల యొద్దకు వెళ్ళు, కాన్వెంట్ ను విడచి పెట్టు”. కాన్వెంట్ నుండి బయటకు వచ్చి అట్టడుగు వర్గాల ప్రజలతో కలసి జీవిస్తూ తన సేవలను కొనసాగించుటకు థెరీసా పై అధికారులకు వినతి పత్రాన్ని పంపింది.

“నువ్వు ఇతరుల లోపాలను వెతకడం ప్రారంభిస్తే ...ఎవరినీ ప్రేమించలేవు”

మిషనరీస్ ఆఫ్ ఛారిటీ స్థాపన :

థెరిసా పాట్నా లోని మెడికల్ మిషన్ సిస్టర్స్ వద్ద శిక్షణ తీసుకుంది. క్షయ వ్యాధి మరియు కుష్ఠు వ్యాధిగ్రస్తులను దగ్గరనుండి చూశారు. అలా పరిశీలించడమే కాకుండా ఆ వ్యాధిగ్రస్తులకు సేవచేయడం ప్రారంభించారు. మరణించే స్థితిలో ఉండే అనేకులను చేతులు పట్టుకొని వారిని ఓదార్చేది. రోగి దగ్గర లేనప్పుడు వారి పరుపులు మార్చడం , రోగులకు స్నానం చేయించడం, ఇంజెక్షన్లు చేయడం ఆమె నేర్చుకున్నారు. స్త్రీలకు ప్రసవ సమయంలో కూడా  ఆమె సహాయం చేసేవారు.

1948 వ సంవత్సరం డిసెంబర్ 8 వ తారీఖున తిరిగి కలకత్తా చేరుకున్నారు. తన చుట్టూ ప్రక్కన గల మురికి గుదీసెలలొ నుండి 5 గురు పిల్లలను తీసికొని వారికి పెరెల్ లేక ప్రక్కన గల ఖాళీ స్థలంలో చదువు నేర్పడం ప్రారంభించారు. కొద్ది రోజులలోనే ఆ బిడ్డలు ఆమె కొరకు ప్రతిరోజూ ఎదురు చూడటం ఆరంభించారు. తమను తాము పరిశుభ్రంగా ఉంచుకోవడం వారికి నేర్పారు. పరిశుభ్రత, అక్షరాభ్యాసత తో పాటు మంచి అలవాట్లు, మాట విషయాలను కూడా వారికి బోధించారు. ఊహించని రీతిలో కొందరు ఆమెకు సహాయం చేయడం ప్రారంభించారు, కొందరు ఆహారం, సబ్బులు, పాలు మొదలైనవి  తెచ్చి ఇవ్వసాగారు. త్వరలోనే 35 మంది పిల్లలు చేరారు. కొన్ని దినాల తరువాత కలకత్తా కార్పోరేషన్ నుండి నిధుల కొరకు దరఖాస్తు చేసుకోమని కొందరు సలహా ఇచ్చారు. కాని ప్రభుత్వ సహాయంతో కాకుండా స్వచ్చందంగానే సేవ చేయాలని విశ్వాసంతో అడుగు ముందుకేశారు. ఆ తరువాత ఒక ఉచిత క్లినిక్ ను కూడా ఆమె ప్రారంభించారు. తరువాతి దినాలలో కలకత్తా లోని ఇరుకైన ప్రాంతంలో గోమ్స్ అనే భారత సంతతి వారికి చెందిన వారు తమ గృహాన్ని థెరీసా సేవల నిమిత్తమై ఉచితంగా ఇచ్చారు. ఆమెతో పాటు సహకరించడానికి మరో ఇద్దరు సిస్టర్లు ముందుకు వచ్చారు. “సంతోషంతో మీ సేవలను అందివ్వండి” అని థెరీసా పదే పదే వేడుకునేవారు. మనుష్యులకు సహాయం చేస్తే యేసుకు సహాయం చేసినట్లే అని ఆమె ఎల్లపుడూ జ్ఞాపకం చేసుకుంటారు.

థెరీసా ఒక చక్కని క్రమశిక్షణ గల ప్రణాళికను తన వసతి గృహంలో అనుసరించేవారు. ఎప్పుడు ప్రార్ధించాలి? తినాలి? ఇంటి నుండి బయటకు వెళ్ళాలి? మొదలగు పనివేళ కొరకు గంటను మ్రోగించేవారు. 1950 సంవత్సరాని కల్లా మిషనరీస్ ఆఫ్ చారిటీస్, కలకత్తా దయాసిస్ నందు ఒక చాపెల్ ప్రారంభమయ్యింది. 1952 లో “నిర్మల్ హృదయ్” ను ప్రారంభించారు. ఆ వసతి గృహంలో అందరూ ఆమెను ‘మదర్’ గా సంబోదించేవారు. మరణావస్థ లో ఉన్న పేదలను సిస్టర్లు మాత్రమే కాకుండా ఆరోగ్య విభాగం వారు కూడా నిర్మల్ హృదయ్ కు తీసుకొని రాసాగారు. అనేకులు దానిని ‘ చనిపోవుచున్న వారికి ఆశ్రయ గృహము’ అని పిలువసాగారు. చనిపోతున్న వారిని ఆఖరు క్షణాలలో క్రైస్తవులుగా మారుస్తున్నారని పుకార్లు వచ్చాయి. కాని థెరీసా ఏ ఒక్కరికీ జవాబు నిచ్చేవారు కాదు. చిరునవ్వుతో “ దేవుడు మిమ్మును కాపాడతాడు, ఆయన మిమ్మును ప్రేమిస్తున్నాడు “ అని మాత్రమే పలికేవారు.

1961 వ సంవత్సరానికంతా 130 మంది సిస్టర్లు సేవలో ఉన్నారు. బెంగాల్ లోని అసాన్సోల్ నందు కుష్ట సేవా కేంద్రాన్ని ప్రారంభించారు.1962 వ సంవత్సరం లో  మహారాష్ట్ర  ప్రాంతంలో మరొక సేవా సదనాన్ని ప్రారంభించారు. ఆ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ థెరీసా ను రాష్ట్రపతి భవన్ కు ఆహ్వానించారు. 1984 సంవత్సరానికంతా 270 హౌస్ లలో 2,400 మంది సిస్టర్లు 70 హౌస్ లలో 500 మంది బ్రదర్లు పరిచర్యలో ఉన్నారు. వారితో పనిచేసే కొ- వర్కర్ల సంఖ్య లక్షకు మించే ఉంటుంది. పీడిత ప్రజలు, వ్యభిచారులు, ఎయిడ్స్ బాధితులు వంటి వారికి నూతన సేవలు ఆరంభించారు. 1996 లో థెరీసా తన  వ ఏట  గుండెపోటు బారిన పడ్డారు. కాని ఆమె అనారోగ్యము నుండి కోలుకొని తిరిగి తన సేవా కార్యక్రమాలను కొనసాగించారు. 1997 వ సంవత్సరం సెప్టెంబర్ 5 న ఉదయకాలపు ఆరాధనకు హాజరయిన థెరీసా తీవ్ర గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు.

ప్రతివాళ్ళు గొప్ప సేవలు చెయ్యలేకపోవచ్చు

కాని చేసిన చిన్న సేవ గొప్పగా ఉండాలి

మనిషిని పట్టి పీడించే పెద్ద వ్యాధి కుష్ఠు రోగమో, క్షయనో కాదు

తాను ఎవ్వరికీ అక్కర్లేదనే భావనే !

ముగింపు :

మదర్ థెరీసా  1979 వ సంవత్సరం లో నోబుల్ బహుమతి తో సహా అనేక అంతర్జాతీయ , జాతీయ అవార్డులను తన సేవలకుగాను అందుకున్నారు. ఒక ఆశ్రయ గృహము, ఒక అనాథ ఆశ్రయము, ఒక కుష్ఠు రోగుల కాలనీ, వివిధ వైద్య కేంద్రాలు, లెక్కించలేని సంఖ్యలో నిరాశ్రయులకు ఆశ్రయాలు భారత దేశం అంతటా మరియు అంతర్జాతీయంగా స్థాపించబడ్డాయి. ఆమె చిన్న రూపం ప్రపంచవ్యాప్తంగా కనికరానికి మారుపేరుగా నిలిచిపోయింది. అభాగ్యులు అన్నివిధాలా బలపరచబడి గుర్తింపు పొందాలని ప్రత్యేకించి యేసు ప్రేమతో నింపబడి శక్తి పొందాలని మదర్ థెరీసా వారిని వెదుకుతూ వెళ్లి తన సేవలను అందించారు. ఆల్బేనియాకు చెందిన ఈ చిన్న పుష్పం భారతదేశం అంతటా తన సేవా పరిమళాలను వెదజల్లింది. క్రీస్తు ప్రేమకు చిహ్నంగా ప్రజల హృదయాలలో నిలిచిపోయింది.



Visit https://missionariesofcharity.org/










No comments:

Post a Comment

Quotes from Famous Scientists about God

  • Albert Einstein -Science without religion is lame, religion without science is blind.
  • Isaac Newton-I have never denied the existence of God. I think the universe is too complex and harmonious to be a result of chance.
  • Galileo Galilei-God is known by nature in his works, and by doctrine in his revealed word.
  • Johannes Kepler-To the Lord whom I worship and thank, That governs the heavens with His eyelid, I return, exalted at His command.

Today's Verse

Systematic Theology in Telugu

Visit Elselah Book House


Total Pageviews